తెలంగాణ మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం: సల్ప గాయాలు, ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎర్రగడ్డలోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిని సోమవారం ఉదయం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన లిఫ్టు ఎక్కగా.. వైరు తెగి లిఫ్టు కిందికి పడిపోయింది.
ఆ సమయంలో లిఫ్టులో మంత్రితో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది గ్రిల్స్ను తొలగించి మంత్రిని కాపాడారు. ఈ ఘటనలో మంత్రి స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. మంత్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు
నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలం కేశతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.