చెప్పా, నువ్వే డిసైడ్ చేసి రాస్కో: ఆంధ్రజ్యోతిపై తలసాని రుసరుస
హైదరాబాద్: ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారని మీడియా ప్రతినిధి పైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు రుసరుసలాడారు. తాను ప్రభుత్వంలో ఉన్నానని, ఏ పార్టీలో ఉన్నానో నీవే డిసైడ్ చేసుకొని రాసుకోమని సలహా ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి పత్రిక పైన పేరు పెట్టి వ్యాఖ్యలు చేశారు. రాసేస్తాం, ఏదో బట్టకాల్చి మీదేస్తాం అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతికి అన్నీ అట్లే కనిపిస్తాయన్నారు. అన్ని తేడాగా కనిపిస్తాయని, మీకు వచ్చే ఆలోచనలు వేరే వారికి రావని మండిపడ్డారు.
తలసాని మంగళవారం మాట్లాడుతూ.. తాను ఒక్కసారి కాదని, వందసార్లు చెబుతున్నానని రాజీనామా చేశానని చెప్పారు. తాను రెండు రోజులు రాజకీయాలు కాదనుకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసన్నారు. తాను అందరి బండారం బయటపెడతానన్నారు.
ఎర్రబెల్లి దయాకర రావు రాజీనామా చేద్దాం రా అన్నారు. ఎర్రబెల్లి గెలిస్తే తాను రాజకీయాలు మానుకుంటానని సవాల్ చేశారు. తాను నైతిక విలువలకు కట్టుబడి ఏనాడో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన రాజీనామా లేఖ కాపీని జేబులో పెట్టుకుని తిరుగుతున్నానన్నారు.