షాకింగ్: ఫోన్లో మాట్లాడుతూ ఒకేసారి రెండు వ్యాక్సిన్లు వేసిన నర్సు, కుప్పకూలిన యువతి
హైదరాబాద్: కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలు తెగించి సేవలు చేస్తూ నలువైపుల నుంచి ప్రశంసలందుకుంటున్నారు. అయితే, కొందరు సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వైఖరితో ప్రజలను కొత్త సమస్యల్లోకి నెడుతున్నారు. బీహార్లో మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు వ్యాక్సిన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Recommended Video
నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సు..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్ జడ్పీహెచ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఓ యువతి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లింది. అయితే, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ఆ యువతి అనారోగ్యానికి కారణమైంది.
యువతికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు వేయడంతో..
ఫోన్లో మాట్లాడుతూనే ఆ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చింది నర్సు. దీంతో వ్యాక్సిన్ వేసుకున్న కాసేపటికే ఆ యువతి కళ్లు తిరిగి అక్కడే కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
పాట్నాలో ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు డోసులు
ఇది ఇలావుండగా, బీహార్ రాష్ట్రంలో మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని పుఫున్ బ్లాక్టౌన్కు చెందిన సునీలా దేవి అనే మహిళ వ్యాక్సినేషన్ కోసం వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లింది. వరుసలో నిల్చుంది. ఆమె వంతు రాగానే ఆమెకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపు అక్కడే కూర్చోవాలని సిబ్బంది చెప్పడంతో అక్కడేవుంది. అనంతరం మరోసారి ఆ మహిళ వరుసలో నిలబడింది. ఈసారి ఆమెకు కోవాగ్జిన్ టీకాను ఇచ్చారు వైద్య సిబ్బంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం గమనించిన వైద్యులు.. వెంటనే ఆ మహిళను అబ్జర్వేషన్ సెంటర్కు తరలించారు. తగిన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం సదరు మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, తన పొరపాటు వల్లే ఇలా జరిగిందని అక్కడి ఏఎన్ఎం అంగీకరించింది.