'తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్యం స్థాపిస్తాం'
నల్గొండ: తెలంగాణలో ప్రజారాజ్యం స్ధాపించే శక్తి సత్తా తమకే ఉందని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం నల్గొండ జిల్లా సూర్యాపేటలో అన్నారు. సీపీఎం జిల్లా 18వ మహాసభల్లో భాగంగా జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు.
ప్రజా సమస్యలపై పోరాడేందుకు వామపక్షాలు ఐక్యంగా ముందుకొస్తున్నాయన్నారు. తెలంగాణలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల కుటుంబాలను పరామర్శించి 5లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేసి అప్పుల బాధ నుంచి ఆదుకోవాలన్నారు.
విద్యుత్ సమస్య, రుణమాఫీ, దళితులకు భూ పంపిణీ, ఫీజురీయింబర్స్మెంట్, ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ముందుండి పోరాటం చేస్తుందన్నారు.
మరో నేత ఎస్ వీరయ్య మాట్లాడుతూ... కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన పేదల సమస్యలను పట్టించుకోవడం మర్చిపోయిందన్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం అభివృద్ధి అనే మంత్రాన్ని పట్టుకొని వేలాడుతోందని ధ్వజమెత్తారు.