ఆపరేషన్ తెలంగాణ - కాషాయం జెండా ఎగరాలి : బీజేపీ కార్యవర్గంలో తీర్మానం - ఇలా ముందుకు..!!
కమలం పార్టీ నేతలు తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలో తమ లక్ష్యం ఏంటనేది స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున కీలక అడుగులు పడనున్నాయి. ఇప్పటికే తెలంగాణ పైన పార్టీ సిద్దం చేసిన తీర్మానం ఆమోదించటంతో పాటుగా.. ఈ సాయంత్రం ప్రధాని మోదీ బహిరంగ సభలో చేయనున్న ప్రసంగం కీలకం కానుంది. సీఎం కేసీఆర్ సైతం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తారని..అందునా తమ పైన ఎక్కువగా విరుచుకుపడతారని ముందుగానే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని తీర్మానం ప్రతిపాదించనున్నారు.
అధికారంలోకి రావాల్సిందే
ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగారలేనది ఈ తీర్మానం అసలు సారాంశం. ఈ మేరకు తీర్మానం నేడు ప్రతిపాదించి ఆమోదించనున్నారు. తెలంగాణలో పూర్తిగా వారసత్వ పాలన నడుస్తోందని, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కేటీఆర్, కవిత, హరీశ్ పాలనా వ్యవస్థను ఆక్రమించుకుని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారని తీర్మానంలో పేర్కొన్నారు.
తెలంగాణలో ఉన్న అవినీతి మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేదని, దానిని అంతమొందించాల్సిందేనంటూ తీర్మానంలో చెప్పుకొచ్చినట్లు సమాచారం. తీర్మానం తొలి రోజునే విడుదల చయాలని భావించినా ఈ రోజుకు వాయిదా పడింది. కుటుంబపాలన, అవినీతి, తెలంగాణ ఏర్పడిన లక్ష్యాన్ని సాధించకపోవడంతో పాటుగా బీజేపీ కార్యకర్తల పైన జరుగుతున్న దాడుల గురించి తీర్మానంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
కీలక అంశాలతో తీర్మానం సిద్దం
ఇక, తీర్మానం ప్రతిపాదన సమయంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రచారం - అధికార లక్ష్యంగా కార్యాచరణ పైన చర్చ జరగనుంది. వచ్చే ఏడాది తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగా పార్టీ బలోపేతం పైన నేతలు మార్గనిర్దేశనం చేయనున్నారు. అమరులు త్యాగాలను గౌరవించాలంటే ప్రజలకు సన్నిహితమైన పాలన రావాల్సి ఉందని, అది బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని ఆ తీర్మానంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని తీర్మానంలో ప్రతిపాదదించారు. పార్టీ ప్రతిపాదించి - ఆమోదించే తీర్మానాల్లో రాజకీయ..ఆర్దిక తీర్మానాలు ఉన్నాయి.
ప్రధాని బహిరంగ సభ పై ఆసక్తి
హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న సమావేశాలు.. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ మొదలు పెట్టిన రాజకీయ దండ యాత్ర నేపథ్యంలో ఇక్కడి నుంచే ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించాలని నిర్ణయించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీ ప్రత్యేకంగా అమిత్ షా - కిషన్ రెడ్డి - బండి సంజయ్ - లక్ష్మణ్ తో సమావేశమయ్యారు. సమావేశాల ఏర్పాట్ల పైన ప్రధాని వారిని అభినందించారు. ఇక, రోజున తెలంగాణలో చేపట్టాల్సిన కార్యచరణ - ప్రధాని బహిరంగ సభలో మార్గ నిర్దేశనం పైన ఆసక్తి నెలకొని ఉంది.