ఫాం హౌస్ వీడియోల పై తరుణ్ చుగ్ సవాల్ - మునుగోడు ఫలితం పై క్లారిటీ...!!
తెలంగాణ ముఖ్యమంత్రి బయట పెట్టిన ఫాం హౌస్ వీడియోలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ వీడియోలను సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలను సుప్రీంతో పాటుగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులకు పంపారు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు పంపించారు. ప్రధాని మోదీని కార్నర్ చేస్తూనే..ఇవి సరికావని సూచించారు. తన ప్రభుత్వాన్ని బీజేపీ తన గడ్డ మీదకు వచ్చి పడగొట్టే కుట్ర చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అంటూ నిలదీసారు. దీని పైన బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు.
ఆ వీడియెలతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేసారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా ఒక డ్రామాగా కొట్టి పారేసారు. ఇప్పటికే ఇదే వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తడి బట్టలతో యాదాద్రిలో ప్రమాణం చేసారని గుర్తు చేసారు. అవి నిజమని కేసీఆర్ ప్రమాణం చేస్తారా అని తరుణ్ చుగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ చేసారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ముక్త రాష్ట్రం కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, ప్రధాని మోదీ దేశ ప్రజలకు చేసిన సేవ పైన తాను చర్చకు సిద్దమని చెప్పారు.
స్టార్ హోటల్ లాంటి ఫాం హౌస్ లో భారీ కొత్త డ్రామాకు తెర తీసారని విమర్శించారు. నిజానిజాలేంటో ప్రజలకు తెలుసని తరుణ్ చుగ్ చెప్పుకొచ్చారు. మునుగోడులో పోలింగ్ ముందు వరకు టీఆర్ఎస్ మంత్రులు అక్కడే మొహరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీ శ్రేణులు కష్టపడ్డారని అభినందించారు. ప్రజలు కేసీఆర్ కు బైబై చెప్పేందుకు సిద్దమయ్యారన్నారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఇదే సమయంలో ఈ కేసులో నిందితుడుగా ఉన్న నందకుమార్ సతీమణి కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
ఈ కేసును సీబీఐకు అప్పగించాలని కోరారు. మరో వైపు నిందితులు ముగ్గురు తరపు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. తమ అరెస్ట్ రద్దు చేయాలని పిటీషనర్లు కోరారు. ఈ కేసులు ఈ రోజు ధర్మాసనం ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, కేసీఆర్ తాజాగా వీడియోలతో సహా బీజేపీ పైన చేసిన ఆరోపణల పైన వరుసగా స్పందించేందుకు బీజేపీ ఢిల్లీ నేతలు సిద్దమయ్యారు. దీంతో ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.