'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు, కెసిఆర్ని సినిమా చూడమన్న గుణశేఖర్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ 'రుద్రమదేవి' చిత్రాన్ని నిర్మించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయనను గురువారం అభినందించారు. ఇలాంటి చారిత్రక చిత్రాలను ప్రోత్సహించాల్సి ఉందని చెప్పారు.
గురువారం గుణశేఖర్, ఇతర చిత్ర యూనిట్ ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిశారు. ఈ సందర్భంగా రుద్రమదేవి చిత్రాన్ని చూడాలని గుణశేఖర్ ముఖ్యమంత్రిని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... ఇలాంటి చిత్రాలు మరెన్నో నిర్మించాలన్నారు. చారిత్రక చిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
శుక్రవారం నాడు విడుదలయ్యే రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేయాలని సూచించారు. కెసిఆర్ నిర్ణయం పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది.
అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కంచిన చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి' చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతోంది. అక్టోబర్ 9న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో పలువురు సినీ లవర్స్ ఆన్ లైన్లో టికెట్లను హాట్ కేకుల్లా కొన్నారు.