టాక్సీ డ్రైవర్ హత్య: 'ఉగ్ర' కుట్ర, హైదరాబాదులో నలుగురి అరెస్టు, దేశవ్యాప్తంగా 25 మంది
న్యూఢల్లీ/ హైదరాబాద్: కనిపించకుండా పోయిన టాక్సీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉగ్రవాద దాడి జరిగిన పఠాన్కోట ప్రాంతంలో కిరాయికి తీసుకున్న టాక్సీ కనిపించకుండా పోయింది.
బుధవారం నుంచి కనిపించకుండా పోయిన వానాల్లో ఇది రెండోది. టాక్సీ డ్రైవర్ను ఉగ్రవాదులు హిమాచల్ ప్రదేశ్లో హత్య చేసి, అదే క్యాబ్లో ఢిల్లీకి బయలుదేరినట్లు అనుమానిస్తున్నారు. దీంతో రహదారులను దిగ్భంధం చేశారు. గణతంత్ర దినోత్సవాలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు ముగ్గురు కుట్ర చేసి క్యాబ్లో ఢిల్లీ బయలుదేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో హైదరాబాదులో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను ఎన్ఐఎ అరెస్టు చేసింది. మరో ఐదుగురి కోసం హైదరాబాదులో గాలింపు చర్యలు చేపట్టారు. వీళ్లంతా ఐసిస్ కోసం పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నలుగురిని బెంగళూరు తరలించారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 25 మందిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.
ఈ వారం మొదట్లో ముగ్గురు వ్యక్తులు తెల్లటి ఆల్టో టాక్సీని అద్దెకు తీసుకున్నారు. హత్యకు గురైన టాక్సీ డ్రైవర్ను పోలీసులు విజయ్ కుమార్గా గుర్తించారు. హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రాలో అతని శవం కనిపించింది.
నోయిడాలో ఎస్యువి మాయం
ఢిల్లీ సమీపంలోని నోయిడాలో సీనియర్ బోర్డర్ పోలీసు అధికారి ఎస్యువి మాయమైంది. ఈ కోత్త టాటా సఫారీని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు లేదా ఐటిబిపి ఇన్స్పెక్టర్ జనరల్ ఆనంద్ స్వరూప్ నివాసం నుంచి దొంగిలించినట్లు తెలుస్తోంది.
గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే వస్తున్నారు. హాలండేను హెచ్చరిస్తూ బెంగళూరు ఫ్రెంచ్ కాన్సులేట్కు గురువారం ఓ లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఈ లేఖ చెన్నై నుంచి మెయిల్ చేసినట్లు సమాచారం.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎన్ఐఎ అధికారులు ఇద్దరు ఐసిస్ అనుమానితులను శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాగా, హైదరాబాదులో శుక్రవారం మధ్యాహ్నం లంగర్ హౌజ్లో మాజిద్ అనే అనుమానితుడిని కూడా అరెస్టు చేశారు. ఎన్ఐఎ అరెస్టు చేసిన మరో ఇద్దరు ఉగ్రవాదులను నజీబ్, ఉబేద్లుగా గుర్తించారు. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.