గ్రేటర్ ఎన్నిక, పవన్ కళ్యాణ్ కోసం టిడిపి ఆరాటం: షాకిచ్చారా? రంగంలోకి బాబు
హైదరాబాద్: భాగ్యనగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటోంది. షెడ్యూల్ విడుదలకు ముందే పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో 2014 నాటి సార్వత్రిక ఫలితాలు రాబట్టుకునేందుకు టిడిపి - బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.
అప్పట్లో టిడిపి - బిజెపిలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. టిడిపి తొమ్మిది, బిజెపి అయిదు స్థానాల్లో గెలిచింది. మజ్లిస్ తనకు పట్టున్న పాతబస్తీలో ఏడు స్థానాలు, తెరాస ఒక స్థానంలో గెలిచింది. టిడిపికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆ తర్వాత తెరాసలో చేరడం వేరే విషయం.
2014 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటినట్లుగానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోను సత్తా చాటేందుకు బిజెపి - టిడిపి మిత్రపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించాలని భావిస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లోను పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టిడిపి - బిజెపి తరఫున జోరుగా ప్రచారం చేశారు. ఇప్పుడు గ్రేటర్లోను పవన్ కళ్యాణ్తో ప్రచారం చేపిస్తే తమకు లాభిస్తుందని ఈ పార్టీలు భావిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అతనితో ప్రచారం చేయించాలనే ఆలోచన ఈ పార్టీలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేతను కలవాలని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఆయన అపాయింటుమెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ టిడిపి నేతలకు పవన్ షాకిచ్చారా?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ షాకిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. టిడిపి నేతలు పవన్కు ఫోన్ చేశారని, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి చేయాలని కోరగా... హామీ ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి.
రంగంలోకి చంద్రబాబు
జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక చంద్రబాబు గ్రేటర్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఓ రోజు చంద్రబాబు ఆధ్వర్యంలో హైదరాబాదులో పార్టీ కార్యకర్తల సదస్సును నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది.
నిజాం కళాశాల మైదానంలో ఈ నెల 9వ తేదీన సమావేశం నిర్ణయించాలని భావిస్తున్నారు. అలాగే, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోకి కూడా చంద్రబాబును తీసుకు రావాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రచారంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తాయని టిడిపి నేతలు భావిస్తున్నారు.
కాగా, గతంలో సమైక్య ఏపీకి తొమ్మిదిన్నరేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే హైదరాబాద్ ప్రపంచపటంలో చేరిందని అందరూ భావిస్తున్నారు. టిడిపి నేతలు ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్కు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. చంద్రబాబు హైటెక్ హంగులు, పవన్ కళ్యాణ్ ఆకర్ష్ తోడైతే టిడిపి - బిజెపి గెలుపు ఖాయమని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. నారా లోకేష్ తోను ప్రచారం చేయించాలని టిడిపి నేతలు భావిస్తున్నారు.
బిజెపికి 55, టిడిపికి 95 సీట్లు!
గ్రేటర్ ఎన్నికల్లో మిత్రపక్షం బిజెపికి 55 స్థానాలు ఇచ్చి, మిగిలిన 95 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని యోచిస్తోంది. బిజెపి ఎదుట దీనిని ప్రతిపాదించినట్లుగా కూడా తెలుస్తోంది. 2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి 5 స్థానాల్లో, టిడిపి 45 స్థానాల్లో గెలుపొందింది.
అయితే, ఇప్పుడు పరిస్థితులు అప్పటిలా లేవు. ఈ నేపథ్యంలో గతంలో బిజెపి గెలిచిన స్థానాలు వారికే, టిడిపి గెలిచిన స్థానాలు వారికే ఇచ్చి, మిగతా స్థానాలను పంచుకోవాలని భావిస్తున్నారు. మిగతా స్థానాలు 100 మిగులుతాయి. అందులో టిడిపి 50, బిజెపి 50 తీసుకోవాలని ప్రతిపాదన చేశారని తెలుస్తోంది. 2009 నాటి పరిస్థితులు ఇప్పుడు లేనందున బిజెపి... టిడిపి లెక్కకు ఓకే చెబుతుందా తెలియాలి.