నా ప్రణాళికలు కేసీఆర్ కొనసాగిస్తున్నారు - చంద్రబాబు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ వేళ..తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల పైన చంద్రబాబు స్పందించారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే తిరిగి టీడీపీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ నుంచి వెళ్లిన నేతలందరూ తిరిగి పార్టీలో చేరి..మీ పాలన మీరే చేసుకోండి అంటూ చంద్రబాబు సరికొత్త పిలుపునిచ్చారు. కాసాని ఆధ్వర్యంలో పార్టీ బలపడుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేసారు.

కేసీఆర్ కొనసాగిస్తున్నారంటూ
దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకొచ్చిన ఆర్దిక సంస్కరణలను ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసింది తానేనని చెప్పారు. ఐటీతో రైతు బిద్ద కంప్యూటర్ పట్టుకొనేలా చేసారనని చంద్రబాబు వివరించారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలను తదుపరి ముఖ్యమంత్రులు .. ప్రస్తుత సీఎం కేసీఆర్ అమలు చేసారంటూ చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. తన విజన్ 2020ని తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేసాయన్నారు. ఏపీలో కూడా 2029లో రూపొందించానని, అయితే అక్కడ అభివృద్ధిని ధ్వంసం చేయటమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

కొత్త వ్యూహాలతో చంద్రబాబు
ఇప్పుడు తన ప్రణాళికలను కేసీఆర్ కొనసాగిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి. తెలంగాణలో 2014లో అటు కేసీఆర్..ఇటు ఏపీలో చంద్రబాబు సీఎం అయిన తరువాత ఓటుకు నోటు వ్యవహారం తెర మీదకు వచ్చిన సమయం నుంచి ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుపు కోసం కేసీఆర్ సహకారం అందించారనేది రాజకీయ వర్గాల్లో అప్పటి నుంచే ప్రచారంలో ఉంది. తెలంగాణలో ఇప్పుడు ప్రధాని మోదీ వర్సస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా రాజకీయం మారింది.

ప్రధాని పర్యటన వేళ ఆసక్తి కరంగా
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాల దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలో తన ప్రణాళికలను కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పటం ద్వారా చంద్రబాబు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసించినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. ఇటు ప్రధాని ఏపీ -తెలంగాణ పర్యటన వేళ.. చంద్రబాబు వ్యాఖ్యలు చర్చకు కారణమవుతున్నాయి. అటు విశాఖలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో 2024 ఎన్నికల్లో ఏపీలో గెలుపు కోసం చంద్రబాబు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications