ధాన్యం కొనుగోలు పై కలెక్టర్లకు వినతి పత్రాలు.! తెలంగాణలో రైతులకు న్యాయం చేయాలన్న టీడిపి.!
హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా జరగక వరి పండించే రైతాంగం పడుతున్న ఇబ్బందులు తీవ్ర రూపం దాలుస్తున్నాయని తెలుగుదేశం తెలంగాణ స్పష్టం చేస్తోంది. వరి రైతులను ఆదుకునే చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టకుండా ఒకరిమీద ఒకరు నెపం మోపుకోవడం శోచనీయమని టీడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. రైతు పండించిన ధాన్యం సేకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడటం సిగ్గుచేటని, రాష్ట్ర రైతాంగానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, అందులో భాగంగా సోమవారం రోజున ఆయా జిల్లాల కలెక్టర్లకు ధాన్యం కొనుగోళ్లపై వినతి పత్రాలు అందించాలని నియోజకవర్గ కోఆర్డినేటర్ లను, జిల్లా కేంద్రం లోని తెలుగుదేశం పార్టీ నాయకులను రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. అందులో భాగంగా రైతులకు మనోధైర్యం కల్పించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హుజూర్నగర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు టీడిపీ శ్రేణులు.

Recommended Video
సోమవారం స్థానిక ఎన్టీఆర్ సెంటర్ నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు టీడిపి నాయకులు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, యాసంగి లో వరి ధాన్యం వేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని టీడిపి నేతలు డిమాండ్ చేశారు. అలాగే పండించిన పంటకు బోనస్ కూడా ఇవ్వాలని, పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ వెంకటేశ్వర్లు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ కే అలీ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మాలోతు నాగు నాయక్ నేలపట్ల అంజయ్య గౌడ్ లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications