రిపబ్లిక్ వేడుకల్లో అపశృతి: ఉపాధ్యాయుడు మృతి
నల్గొండ: జిల్లాలోని గోరేన్ కల్ పల్లిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొన్న ఎర్రమాడ నరేంద్ర రెడ్డి (53) అనే ఉపాధ్యాయుడు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోగా, కుప్పకూలిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు.
దాంతో ఆ పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాధమిక పాఠశాలలో తొలిసారి జరిగిన వేడుకల్లో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఉపాధ్యాయుడు తుదిశ్వాస విడిచిన సమయంలో ప్రైమరీ స్కూల్ టీచర్లు ఆయన పక్కనే ఉన్నారు. దీంతో వారంతా ఏం జరిగిందో తెలియక వారంతా విషాదంలో మునిగారు.
ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు
కరీంనగర్ జిల్లాలోని బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ఆదర్శ పాఠశాల విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగిన వెంటనే ఆటో డ్రైవర్ ఆటోను వదిలి పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని డైవర్ కోసం గాలిస్తున్నారు.
ఆలయం వద్ద రంకెలు వేసిన కోడెలు... ఇద్దరికి గాయాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కోడెలు రంకె వేస్తూ ఇద్దరు భక్తుల పైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన దేవాలయ సిబ్బంది కోడెలను అదుపు చేసి గాయపడిన భక్తులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.