సోనియాగాంధీని కలిసిన తర్వాత ''టీక్ హై.. .ముజే కహనా హోగా.. అంటారు??
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఎవరికి వారుగా విడిపోయి, విభేదాలతో రచ్చకెక్కి పార్టీ పరువును గంగపాలు చేశారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్రెడ్డి నియామకం నుంచి ప్రారంభైన వివేదాలు చిలికి చిలికి గాలివానలా మారి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరేంతవరకు వెళ్లింది. ఆయన సోదరుడు ఎంపీ వెంకటరెడ్డికి, రేవంత్రెడ్డికి మాటల యుద్ధం నడిచింది. తాజాగా మర్రి శశిధర్రెడ్డి కూడా అసమ్మతి స్వరం వినిపించారు.

పార్టీలో జరుగుతున్న అవమానాన్ని తెలియజేస్తా..
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విభేదాలను సోనియాగాంధీ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ను కోరారు. రాష్ట్రంలో పార్టీ పరిణామాలను వివరించడంతోపాటు తనకు జరుగుతున్న అవమానాన్ని సోనియాకు తెలియజేయాలనే ఉద్దేశంతో అపాయింట్మెంట్ కోరినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. తనదగ్గరున్న సమాచారాన్ని సోనియాకు తెలియజేస్తానని, పార్టీని బాగుచేయడానికి సలహాలిస్తానని చెప్పారు.

రేవంత్ కు ఠాగూర్ సహకరిస్తున్నారు
టీపీసీసీలో జరుగుతున్న పరిణామాలను తెలియజేయాలనుకుంటున్నానని, అందుకే సోనియాలను కలవాలని నిర్ణయించినట్లు మర్రి తెలిపారు. తెలంగాణలో పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాణికం ఠాగూర్ పార్టీని ముందుకు నడిపించాల్సిందిపోయి రేవంత్రెడ్డి చెప్పిందిచేస్తూ ఆయనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి కాంగ్రెస్కు నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన ఠాగూర్, రేవంత్ ఇద్దరూ కలిసి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పరిస్థితిని నేరుగా సోనియాకు తెలియజేయడానికే కలబోతున్నట్లు శశిధర్ రెడ్డి తెలిపారు.

పెద్దగా ప్రయోజనం లేకపోవచ్చు!!
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు వీరు సోనియాను కలవడంవల్ల పెద్దగా ఉపయోగం లేదని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ స్థాయి నేతలతో సత్సంబంధాలుండే ఠాగూర్ మాటలకే విలువ ఎక్కువుంటుందని, రేవంత్ రెడ్డి దూకుడుగా పార్టీని ముందుకు తీసుకువెళతారనే అభిప్రాయంతో రాహుల్ గాంధీ స్వయంగా ఎంపిక చేశారని, విభేదాలేమైనా ఉంటే కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిందేనని సూచిస్తారని, అంతకుమించి కోమటిరెడ్డికానీ, మర్రి కానీ సోనియాను కలిసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications