టోఫెల్ పేరు చెప్పి బిటెక్ గ్రాడ్యుయేట్స్ టోకరా
హైదరాబాద్: టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్) పేరు చెప్పి విదేశీ చదువులకు వెళ్లాలని ఆసపడిన వారిని మోసం చేసిన బిటెక్ గ్రాడ్యుయేట్స్ను పోలీసులు పట్టుకున్నారు. అభిషేక్రెడ్డి అలియాస్ రోహిత్ అలియాస్ విష్ణువర్ధన్ రెడ్డి, వంశీ మరో ముగ్గురు స్నేహితులు కలసి హైదరాబాదులోని అమీర్పేట నీలానగర్లో ఓ అపార్ట్మెంట్లో ప్రయివేటు సంస్థను నడుపుతున్నారు.
అయితే అలా నడపడం లాభసాటిగా లేదని భావించి మోసానికి తెర తీశారు. విదేశీ చదువుల కోసం ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 20 వేల మంది ఈ పరీక్ష రాస్తున్నట్టు గమనించి పక్కా ప్రణాళిక రూపొందించారు. తమ పథకంలో భాగంగా తొలుత ఫేస్బుక్, ట్విట్టర్లలో నకిలీ వివరాలతో ఖాతాలను ప్రారంభించారు. విదేశీ విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వివరాలను సేకరించేవారు.
వారికి టోఫెల్ పరీక్షలో మంచి మార్కులు సంపాదించేందుకు తాము సాయపడతామని, ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఆ పరీక్ష ప్రశ్నపత్రాలను ముందుగానే సిద్ధం చేస్తామని నమ్మించేవారు. ఆన్లైన్ పరీక్షకు అభ్యర్థులు నిర్ణయించుకున్న సమయానికి ముందుగానే ప్రశ్నలు, సమాధానాలను సిద్ధం చేసేవారు. వీరు ఇచ్చిన ప్రశ్నపత్రాల్లో కొన్ని పరీక్ష జరిగే రోజున రావటంతో చాలా మంది అమాయకులు రూ.30 వేల నుచి రూ.40 వేల వర కూ చెల్లించి పరీక్ష రాసేవారు.
ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన ఒకరు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు అభిషేక్, వంశీలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. టోఫెల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ వెబ్సైట్ను హ్యాక్ చేసి, ప్రశ్నపత్రాలను దొంగిలించడం అంత సులభం కాదని సీసీఎస్ పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ కంప్యూటర్ నిపుణులు కావటంతో టోఫెల్ పాత ప్రశ్నపత్రాలను సేకరించి వాటిలో ఎక్కువగా వచ్చే ప్రశ్నలతో ఒక బోగస్ ప్రశ్నపత్రాన్ని రూపొందించి అభ్యర్థులకు ఇచ్చేవారని చెప్పారు.
అభిషేక్, వంశీ దాదాపు 50 మంది నుంచి 15 లక్షల రూపాయల దాకా వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అబిషేక్, వంశీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.