హైదరాబాద్లో రెక్కీలు, కుట్ర భగ్నం: పట్టుబడినవారిలో టెక్కీ, ఇరాక్ నిధులు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేసే క్రమంలో ఎన్ఐఎ అధికారులు హైదరాబాదులో అరెస్టు చేసిన నలుగురి నుంచి సేకరించిన సమాచారం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అప్రమత్తంగా వ్యవహరించడంతో హైదరాబాద్ నగరానికి భారీ ముప్పు తప్పింది.
హరిద్వార్ పుణ్యక్షేత్రంలో సమాచారం లీకవ్వడంతో ఐఎస్ఐఎస్తో సంబంధం నలుగురు సానుభూతిపరులను రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. సానుభూతిపరుల నుంచి సుమారు కిలోన్నర గన్పౌడర్, అధిక తీవ్రత కలిగిన ఐఈడీ పేలుడు పదార్థాలు, పలు డిటోనేటర్లు, పలు ప్రాంతాల మ్యాప్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాదులోని టోలిచౌకిలో ముగ్గురు, మాదాపూర్లో ఒకరు పట్టుబడినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వారిలో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తుండగా మిగతా వారంతా ఇతరత్రా పనులు చేస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో షరీఫ్ మొయినుద్దీన్ (58) ఎలక్ట్రీషియన్ కాగా, ఉబేద్(22) ప్రైవేటు సంస్థలో, అబూ అమాస్(23) సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. నఫీఖ్ (21) మాత్రం నిరుద్యోగి. వీరు జమాద్ ఉల్ ఖలీఫా ఎ హింద్ అనే సంస్తను ఏర్పాటును చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు బయటపడింది.

వీరంతా సోషల్ మీడియా నెట్వర్క్తో ఐఎస్తో సంభాషిస్తూ విధ్వంసానికి వ్యూహం రచించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. హరిద్వార్లో అరెస్టయిన ఇండియన్ ముజాహిద్దీన్తోనూ సంబంధాలు కొనసాగించారనే అనుమానాన్ని ఎన్ఐఏ వ్యక్తం చేస్తున్నది. వీరికి ఇరాక్ నుంచి నిధులు సమకూరినట్లు సమాచారం. వీరు పైపు బాంబుల తయారీలో నిపుణులుగా భావిస్తున్నారు.
ఐఎస్ ఆదేశాలతో టార్గెట్ ప్రాంతాల్లో రెక్కీలు కూడా నిర్వహించారని ఎన్ఐఏ అధికారులు స్పష్టంచేశారు. రైళ్లు, రద్దీ ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన షఫీ అమర్తో కలిసి విధ్వంసానికి కుట్రపన్నినట్టు నిఘా వర్గాలు తేల్చాయి. ఈ క్రమంలోనే షఫీ అమర్తో టచ్లో ఉన్న మరో నలుగురిని బెంగళూర్లో అదుపులోకి తీసుకున్నట్టు కేంద్రహోంశాఖ అధికారి ఒకరు స్పష్టంచేశారు.
వీరివద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించడంతో స్థానికంగానే బాంబులను తయారు చేస్తుంటారనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేశారు. నలుగురు సానుభూతిపరులను విచారణ కోసం ఢిల్లీలోని ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం తరలించినట్టు సమాచారం. వీరివద్ద లభించిన మ్యాపులు హైదరాబాద్కు చెందినవా? మెట్రో నగరాలకు చెందినవా అనే సమాచారం తెలియాల్సి ఉంది.
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రెక్కీ నిర్వహించారా అనే దిశగా అధికారులు దృష్టిపెట్టారు. ఈ అరెస్ట్లపై హైదరాబాద్ పోలీసులు గానీ, ఎన్ఐఏ అధికారులు పెదవి విప్పడం లేదు. ఈ సంఘటనతో జంట కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications