తెలంగాణలో ఒకేరోజు 6 మరణాలు.. కొత్తగా 178 కేసులు.. గాంధీలో డాక్టర్లపై మరో దాడి.. మెరుపు ధర్నా..
లాక్ డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తూ ప్రజల్ని బలితీసుకుంటున్నది. మంగళవారం రాత్రి ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో ఆరుగురు చనిపోయారు. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 148కి చేరింది. అంతేకాదు, కొత్త కేసుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. మరోవైపు గాంధీ ఆస్పత్రిలో మరోసారి వైద్యులపై దాడి జరగడం ఉద్రిక్తతకు దారితీసింది.

కొత్తగా 178 మందికి..
సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం దాకా నిర్వహించిన టెస్టుల్లో కొత్తగా 178 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరంతా లోకల్ వ్యక్తులే కావడం గమనార్హం. కొత్తవాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,920కి పెరిగింది. ఇందులో కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుని ఇప్పటికే 1,742 మంది డిశ్చార్జికాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 2,030గా కొనసాగుతున్నది. మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్ డేంజర్..
కరోనా వైరస్ కేసులు, మరణాలకు సంబంధించి హైదరాబాద్ డేంజర్ జోన్ గానే కొనసాగుతున్నది. మంగళవారం 178 కొత్త కేసులు వస్తే అందులో అత్యధికంగా 143 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వాళ్లే కావడం గమనార్హం. ఒక్క సిటీ పరిధిలోనే కేసుల సంఖ్య 3వేలకు చేరువకాగా, మరణాల సంఖ్య 137గా ఉంది. జీహెచ్ఎంసీ తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాగా కొనసాగుతోన్న రంగారెడ్డిలో కొత్తగా 15 కేసులు వచ్చాయి. ఇక్కడ మొత్తం కేసులు 200కు చేరువయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 10, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రెండేసి కొత్త కేసులు, జగిత్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్ లో ఒక్కో కొత్త కేసు రికార్డయింది.

గాంధీలో డాక్టర్లపై దాడి
పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా రూపాంతరం చెందిన గాందీ ఆస్పత్రిలో మరోసారి వైద్యులపై దాడి జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లపై.. అక్కడ చికిత్స పొందుతోన్న కొవిడ్ పేషెంట్ల తాలూకు బంధువులు కొందరు మంగళవారం దాడికి తెగబడ్డారు. గతంలోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకోగా.. భద్రతను కట్టుదిట్టం చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు..

జూడాల మెరుపు ధర్నా..
కొవిడ్ పేషెంట్ల తాలూకు బంధువులు తమపై దాడి చేయడాన్ని నిరసిస్తూ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తోన్న జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలోనూ తమపై దాడి జరిగిందని, భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రకటన అమలుకు నోచుకోలేదని, ఇలాంటి భయానక పరిస్థితుల్లో తాము డ్యూటీ చేయలేమని జూడాలు అన్నారు. యువజర్నలిస్టు మృతి తర్వాత గాంధీ ఆస్పత్రిలో సౌకర్యాల లేమిపై విమర్శలురాగా.. ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications