కొత్త వైరస్ స్ట్రెయిన్ పుట్టుకొచ్చిన వేళ: తెలంగాణలో మారుతోన్న కరోనా లెక్కలు: మళ్లీ మొదటికి?
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోన్న వేళ.. మరణాల సంఖ్య నామామత్రంగా నమోదవుతోన్న సందర్భంలో తెలంగాణ లెక్కలు మారుతున్నాయి. బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. హైదరాబాద్లో కనిపించడం ఆందోళనకు దారి తీస్తోంది. బ్రిటన్ నంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో ఇద్దరిలో వేరియంట్ లక్షణాలు వెలుగు చూడటంతో కరోనా కథ మళ్లీ మొదటికి వస్తుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బ్రిటన్ నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో ఇద్దరికి స్ట్రెయిన్ సోకినట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది.
అమెరికాలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్: తొలికేసు: నో ట్రావెల్ హిస్టరీ: లోకల్గా వ్యాప్తి
రోజువారీ కేసులు రెట్టింపు..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 474 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 592 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,85,939కి చేరింది. ఇందులో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,78,523 మంది ఉన్నారు. 1,538 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు అయిదు వేలకు దిగువగా నమోదు అయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 5,878 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 3,735 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రేటర్ సహా..
అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 102 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కొత్త వేరియంట్ కేసులను ఈ జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా మరో బులెటిన్ను అధికారులు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ వాటా అధికంగా ఉంటోంది. ఈ స్థాయి కేసులు మరే ఇతర జిల్లాల్లోనూ నమోదు కాలేదు. సాధారణంగా గ్రేటర్తో పోటీ పడుతూ కేసులు వెలుగులోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరిల్లోనూ రోజువారీ కేసులు రెండంకెలకే పరిమితం అయ్యాయి.
జిల్లాల్లో భారీగా తగ్గిన కేసులు..
ఆదిలాబాద్-8, భద్రాద్రి కొత్తగూడెం-18, జగిత్యాల-9, జనగామ-6, జయశంకర్ భూపాలపల్లి-6, కామారెడ్డి-4, కరీంనగర్-29, ఖమ్మం-11, కొమరంభీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్నగర్-6, మహబూబాబాద్-9, మంచిర్యాల-14, మెదక్-7, మేడ్చల్ మల్కాజ్గిరి-45, ములుగు-7, నాగర్ కర్నూల్-5, నల్లగొండ-11, నారాయణ్పేట్-1, నిర్మల్-5, నిజామాబాద్-8, పెద్దపల్లి-10, రాజన్న సిరిసిల్ల-6, రంగారెడ్డి-49, సంగారెడ్డి-14, సిద్ధిపేట్-14, సూర్యాపేట్-10, వికారాబాాద్-8, వనపర్తి-7, వరంగల్ రూరల్-6, వరంగల్ అర్బన్-25, యాదాద్రి భువనగిరి-9 కేసులు నమోదు అయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
45 వేలకు పైగా టెస్టులు..
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 45,590 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 68,39,281గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,83,752 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారి నమూనాలను సీసీఎంబీ పరీక్షించిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరిలో కొత్త మ్యూటెంట్ లక్షణాలు కనిపించినట్లు కేంద్రం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.