ఏపీ సీఎంకు లేఖ రాస్తేనే: చంద్రబాబు చేతిలో విభజన అధికారం!
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరగవలసిన విభజన ప్రక్రియ అధికారాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారా? అంటే అవుననే అంటున్నారు.. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాలు ఇంకా పరిష్కరించబడలేదు. ముఖ్యంగా ఉద్యోగుల విభజన ఆలస్యమవుతోంది. దీని పైన తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోదండ దీనిపై స్పందించారు.
ఆయన మహబూబ్ నగర్లో మాట్లాడారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైకోర్టును విభజించాలని కేంద్రాన్ని అడిగితే చంద్రబాబు లేఖ రాస్తే తప్ప చేయమని చెబుతోందన్నారు.
రాష్ట్రపతి చేయాల్సిన పనిని ఏపీ ముఖ్యమంత్రి చేతిలో పెట్టడం సరికాదన్నారు. ఉద్యోగుల విభజనకు ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ కూడా సరిగా పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ కాలపరిమితిని పొడిగించడం సరికాదన్నారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపు: పోచారం
వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. వరంగల్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు. వరంగల్ లోకసభలో పోటీ చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారన్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
వరంగల్ లోకసభలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా గ్రామాలన్నీ టీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నాయన్నారు. రాష్ట్రంలో సంక్షేమానికి ప్రభుత్వ పెద్ద పీఠ వేస్తోందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.