తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు తుదిదశ కసరత్తు- నిర్ణయాలు..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ.. అక్కడి వాతావరణం హీటెక్కుతోంది. అక్టోబర్/నవంబర్లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలల్లో పోలింగ్ నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.
తెలంగాణలో అధికార భారత్ రాష్ట్ర సమితి ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమైంది. అభ్యర్థుల జాబితాను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. టికెట్ లభించిన అభ్యర్థులందరూ తమ నియోజకవర్గాల్లో మకాం వేశారు. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో పోల్చుకుంటే బీఆర్ఎస్ ఓ అడుగు ముందే ఉంది.

గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈ సమావేశం ఆరంభమైంది. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఇందులో పాల్గొన్నారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, అదనపు డీజీలు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయా పార్టీల నాయకులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకుండా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని వికాస్ రాజ్ సూచించారు. పోలింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక, సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, దీనికి సంబంధించిన జాబితాను ఎన్నికల కార్యాలయానికి పంపించాలని వికాస్ రాజ్ పేర్కొన్నారు. అలాంటి పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసులను మోహరించాల్సిన అవసరం ఉందని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వికాస్ రాజ్.. పోలీసు అధికారులకు సూచించారు. సున్నిత ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications