Raja Singh: తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేశారు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
పోలింగ్ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే.

ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ (Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టతను ఇచ్చారు. ఈ మధ్యాహ్నం ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున తన సొంత నియోజకవర్గం గోషామహల్ నుంచి పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు వస్తాయని రాజా సింగ్ అంచనా వేశారు. మరో 50 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వనున్నామని వివరించారు. 45 రోజులుగా తాను గోషామహల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటినీ పలకరించానని, అందరి మదిలోనూ బీజేపీ ఉందని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లు ఎప్పుడో తీర్మానించుకున్నారని వ్యాఖ్యానించారు.
2014, 2018 ఎన్నికల్లో ప్రజలు తనను ఎలా ఆదరించారో.. ఈ ఎన్నికల్లో కూడా అదే తరహాలో ఆదరిస్తారని, గోషామహల్.. బీజేపీకి కంచుకోటగా మారిందని రాజా సింగ్ ధీమా అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఇక్కడ కమలం మాత్రమే వికసిస్తుందని, మరే ఇతర పార్టీకీ అవకాశమే లేదని స్పష్టం చేశారు.
తన అంచనా ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీికి 40 సీట్లు ఖచ్చితంగా వస్తాని, మరో 50 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని రాజా సింగ్ అన్నారు. ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామంటూ గతంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. తాను ప్రభుత్వంతో కొట్లాడి 500 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని అన్నారు.












Click it and Unblock the Notifications