తెలంగాణ అసెంబ్లీ భేటీ షురూ: బడ్జెట్ ఎప్పుడంటే: ఒకటి నుంచి రెండుకు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాస్సేపట్లో ఆరంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమౌతుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి దీనికి నేతృత్వం వహిస్తారు. అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలు దీనికి హాజరవుతారు. ఎన్ని రోజుల పాటు కార్యకలాపాలను నిర్వహించాలనేది ఖరారు చేస్తారు. బడ్జెట్ సమావేశాలు కావడం వల్ల రెండు వారాలకు పైగా అసెంబ్లీ భేటీని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.82 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సారి ఈ సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేసిన లాక్డౌన్ వల్ల ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. ఫలితంగా- ఈ లోటును భర్తీ చేసుకోవడానికి కొత్తగా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలను ప్రవేశపెడతారనేది ఆసక్తి రేపుతోంది. ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు ఎలా ఉండబోతోన్నాయనేది హాట్ టాపిక్గా మారింది.

భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం పెరిగిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గోషా మహల్కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న టీ రాజాసింగ్కు ఇక రఘునందన్ రావు తోడు కానున్నారు. సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీకి నిర్వహించిన ఉప ఎన్నికలో ఆయన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఆయన ఇదివరకే ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఎన్నికల ప్రచార సమయంలో భారీ ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలను సంధించుకున్న నేపథ్యంలో.. ఆ పోలింగ్ ముగిసిన మరుసటి రోజే అసెంబ్లీ సమావేశం కానుండటం వల్ల.. వాటి తీవ్రత ఎలా ఉంటుందనే విషయంపై అందరి దృష్టీ నిలిచింది.












Click it and Unblock the Notifications