ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. గులాబీ బాస్ రానున్నారా ?
బీఆర్ఎస్ వ్యవస్థాపకులు, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌజ్లో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కవిత సహా పలువురు నేతలు హాజరయ్యారు. దాదాపుగా 3 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 12 నుంచి 27 వరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే గత బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఒకరోజు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.

దీంతో ఈసారి జరగనున్న సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత పాల్గొంటారని గులాబీ వర్గాలంటున్నాయి. కాళేశ్వరం, అప్పుల విషయం, ఎన్నికల హామీల అమలు విషయంలో ప్రభుత్వం తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
అంతే కాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం దిశగా కేసీఆర్ ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభకు కేసీఆర్ ప్లాన్ చేసినట్టు టాక్ నడుస్తోంది. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సభ హైదరాబాద్ వేదికగా జరుగుతుందని గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దానిపై కూడా సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. 2 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ స్కెచ్ వేశారని అనుకుంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కూడా హాజరయ్యారు.
ఇక ఇప్పటికే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కేసీఆర్ కు కాంగ్రెస్ నేతలు సవాల్ చేస్తున్నారు. సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని.. అనర్హత భయం కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు. చూడాలి మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా.. రారా అని..












Click it and Unblock the Notifications