Telangana: నిరసనలకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం
Telangana: ఆటో డ్రైవర్ల సమస్యలపై రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. లేదంటే ప్రభుత్వానికి తమ నిరసన సెగ తప్పదని ఆటో డ్రైవర్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలతో పాటు 24వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఆటోడ్రైవర్లకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్ సర్కారు వాటిని విస్మరించిందని అన్నారు.
ఇంతకు ముందే నాలుగు నెలల క్రితం తాము సమ్మెకు పిలుపునిచ్చామని.. అప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇంటికి పిలిపించి చర్చలు జరిపారన్నారు. చర్చలు జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేలు ఇస్తామని ఇప్పటికీ ఆ పథకం అమలు చేయలేదని.. వెంటనే ఆ హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న రాష్ట్ర బడ్జెట్ లో ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications