స్విగ్గీ, జోమాటోపై నిషేధం: స్కూళ్ల ఫీజు పెంపులేదు, అద్దెలు వసూలు చేయొద్దు, వారికి జీతాలు 10శాతం..
హైదరాబాద్: తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని మతాల పండగలు, ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని తెలిపారు. రంజాన్ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని స్పష్టం చేశారు. సామూహిక ప్రార్థనలు అనుమతించడం లేదని తేల్చి చెప్పారు. అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ భక్తులకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.
తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్, సడలింపుల్లేవ్! నిజాముద్దీనే కొనసాగుతోంది: కేసీఆర్
స్విగ్గీ, జోమాటోపై నిషేధం..
అంతేగాక, తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20 నుంచి ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జోమాటోలను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో పిజ్జా డెలివరి బాయ్ కారణంగా 69 మంది క్వారంటైన్లో చేరారని గుర్తు చేశారు. నెల రోజులు పిజ్జా తినకపోతే చచ్చిపోతామా? అని మండిపడ్డారు. ఇళ్లల్లోనే వంటలు చేసుకుని తినాలని సూచించారు. మే 7 వరకు బయటి తినుబండరాలు వద్దని సూచించారు. పరిశుభ్రత పాటించాలన్నారు.
వారికి 10శాతం జీతం అదనం..
గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులందరూ అద్భుతంగా పనిచేస్తున్నారని సీఎం కేసీఆర్ కొనియాడారు. మనరాష్ట్రంలో ఎవరూ అన్నం దొరక్క ఉపవాసం ఉండవద్దని, తోచిన సాయం చేయాలన్నారు. మే నెల కూడా జీతాల కోతలు కొనసాగుతాయన్నారు. అయితే, పింఛన్లలు ఈసారి 75శాతం అందజేస్తామని అన్నారు. ఇంతకుముందు 50శాతమే అందించామన్నారు. వైద్యులు, మున్సిపల్, హెచ్ఎండబ్ల్యూ, గ్రామ పారిశుద్ధ్య సిబ్బందికి 10శాతం ఎక్కువ జీతం అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు కూడా గ్రాస్ శాలరీ మీద 10శాతం ఎక్కువ చెల్లిస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగులకు 100శాతం జీతం ఇస్తున్నట్లు తెలిపారు.
అద్దెలు వసూలు చేయొద్దు..
డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం ఇళ్ల కిరాయిదారులు మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల ఇంటి అద్దె వసూలు చేయవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అద్దెలు అడిగి వేధిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాక, వాయిదా వేసిన అద్దెపై వడ్డీ వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. ప్రాపర్టీ టాక్స్ 2019-2020 అపరాధ రుసుం లేకుండా మే 31 వరకు చెల్లించుకోవచ్చని తెలిపారు.
స్కూళ్ల ఫీజు పెంపులేదు..
ఇక రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు 2020-2021 విద్యా సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచకూడదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. అలాగే రకరకాల ఫీజులంటూ రూపాయి కూడా వసూలు చేయొద్దన్నారు. ట్యూషన్ ఫీజు కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయొద్దని, అది కూడా నెలవారీగా తీసుకోవాలన్నారు. ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెల్లరేషన్ కార్డు వారికి మే నెలలో కూడా వ్యక్తికి 12 కిలోల బియ్యం చొప్పున ఉచితంగా అందజేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రూ. 1500 కూడా మే మొదటి వారంలోగా అందుతాయన్నారు. బ్యాంకు ఖాతాలో వేసిన డబ్బులు వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారు. పుకార్లు నమ్మవద్దన్నారు. ఆసరా పెన్షన్లు కూడా 2016 ఇస్తామన్నారు. వలస కూలీల కుటుంబాలకు రూ. 1500, 12 కేజీల బియ్యం ఇస్తామన్నారు. లాక్ డౌన్ పిరియడ్లో ఫిక్స్డ్ ఛార్జీల్లో ఏప్రిల్, మే నెలల్లో రద్దు చేస్తున్నామన్నారు. 1శాతం రిబేటు కల్పిస్తామన్నారు.
Recommended Video
గచ్చిబౌలిలో కోవిడ్ ఆస్పత్రి.. అద్భుతమైన టిమ్స్ ఆస్పత్రి..
డాక్టర్లు, వైద్య సిబ్బందికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 78 ఎకరాలు ఉన్నాయని, 14 అంతస్తులు 540 గదులున్న భవనం ఖాళీగా ఉందని, దాన్ని హెల్త్ డిపార్ట్ మెంట్ బదిలీ చేశామన్నారు. ఇక్కడ 1500 బెడ్స్తో కోవిడ్ స్పెషల్ ఆస్పత్రి సిద్దంగా ఉందన్నారు. ఆ తర్వాత మరో 15 ఎకరాలు జతచేసి అద్భుతమైన ఆస్పత్రి తయారు చేస్తామని కేసీఆర్ చెప్పారు. దీనికి ‘టిమ్స్'అని పేరు పెడతామన్నారు. ప్రజల కోసం మల్టిస్పెషాలిటీ ఆస్పత్రి రూపుదిద్దుకుంటుందన్నారు. క్రీడా పాలసీని తీసుకొచ్చి క్రీడలను, మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో పండిన పంటలన్నింటినీ కొంటామని, రైతులు ఆందోళనచెందవద్దని కేసీఆర్ చెప్పారు. ఎరువుల కోసం పెళ్లి మండపాలను వాడుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. రామగుండం ఎఫ్ సీఐ అందుబాటులోకి వస్తే ఎరువులకు ఇబ్బంది ఉండదన్నారు. తెలంగాణలో మే 7 తర్వాత కూడా పెళ్లిలకు అవకాశం లేదని చెప్పారు. ఇళ్ల నుంచి ఎవరూ కూడా బయటికి రాకూడదని అన్నారు. కరోనా కేసులు తగ్గడం లేదని, కరోనాకు మందు కూడా లేదని అన్నారు.