19 లక్షల రేషన్ కార్డులు రద్దు, కొత్తవేవీ లేవు: ఎన్హెచ్ఆర్సీకి బండి సంజయ్ ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణలో రేషన్ కార్డులను రద్దు చేయడం, కొత్తి మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 19 లక్షల రేషన్ కార్డులు.. కొత్తవాటి మంజూరుపై విధించిన నిబంధనలపై దర్యాప్తు జరపాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు.
అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డుల మంజూరుపై విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్.టీఆర్ఎస్ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 19 లక్షల రేషన్ కార్డులు రద్దుచేశారని తెలిపారు.
కొత్తరేషన్ కార్డులు కావాలంటూ తెలంగాణలో ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. జూన్ 2021 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను మీసేవ సెంటర్లు ఆమోదించడం లేదని ఫిర్యాదులో బండి సంజయ్ పేర్కొన్నారు.
కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: కేఏ పాల్
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ జైలు కెళ్లడం ఖాయం. ఆయన చేసిన అవినీతిపై సీబీఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేశా. రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోక దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్ బయల్దేరిండు అంటూ దుయ్యబట్టారు. కేటీఆర్ను సీఎం చేసి బీఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాలు చేస్తడట అని విమర్శించారు.
మీరు అనుకున్నది జరగదు అని కేసీఆర్పై మండిపడ్డారు కేఏ పాల్. అమీర్పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో రూ.లక్షా5 వేల కోట్లు, యాదాద్రిలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలను సీబీఐ డైరెక్టర్ జైస్వాల్కు అందజేశానని తెలిపారు. రాష్ర్టం వచ్చాక కేసీఆర్, ఆయన కుటుంబం, పక్కనున్నోళ్లు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ అంటే తోడు దొంగల రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ భారత బడాచోర్ రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు కేఏ పాల్.