నో డౌట్.. సింగపూర్ తరహాలో టీ, మూడేళ్లలో: కేసీఆర్
హైదరాబాద్: సింగపూర్ తరహాలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాదును ప్రపంచ దేశాల గమ్యస్థానంగా చేస్తామన్నారు.
హైదరాబాదును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాదులో ప్రపంచ స్థాయి పోలీసింగ్ వ్యవస్థతో పాటు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాదుకు వంద కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో ఐఐఎం విద్యార్థుల భాగస్వామ్యంతో పరిశ్రమలకు అనుకూలించని భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు పన్ను, విద్యుత్ చార్జీల రాయితీలిస్తామన్నారు. సింగపూర్లో జీరో కరప్షన్ ఉండటం, క్రమశిక్షణ, టైమ్ మేనేజ్మెంట్ తనను ఆకట్టుకున్నాయన్నారు.
సింగపూర్ను తాను స్వయంగా చూశాక.. తెలంగాణ ఇదే స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందనే పూర్తి నమ్మకం తనకు కలిగిందని, ఇంకా తన మదిలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. రానున్న మూడేళ్లలో తాము విద్యుత్ సమస్యను అధిగమిస్తామని చెప్పారు.
కాగా, సింగపూర్ పర్యటనలో ఉన్న కేసీఆర్ అంతకుముందు ఇంపాక్ట్ - 2014 సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రం అవకాశాలు - సవాళ్లు అనే అంశం పైన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications