కేసీఆర్ సర్కార్ పతనానికి పునాది వేశాం: పాతబస్తీలో బండి సంజయ్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. కొద్దిసేపటి కిందటే పాతబస్తీలో పర్యటించారు. చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తి కావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.

36 రోజులుగా..
మలి విడత పాదయాత్ర షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన ఆయన తొలివిడత ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి బండి సంజయ్..ఈ పాదయాత్రను తలపెట్టిన విషయం తెలిసిందే. 36 రోజుల పాటు తొలి విడత పాదయాత్ర సాగింది. మొత్తం 438 కిలోమీటర్ల మేర కాలినడకన వివిధ గ్రామాలు, నియోజకవర్గాల్లో పర్యటించారు.

అండగా.. పార్టీ జాతీయ స్థాయి నాయకులు..
ఎనిమిది జిల్లాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆరు లోక్సభ స్థానాలను కవర్ చేశారు. ప్రతి రోజూ బహిరంగ సభలను నిర్వహించారు. తన తొలి విడత పాదయాత్రను ఇటీవలే తన సొంత లోక్సభ నియోజకవర్గం కరీంనగర్ పరిధిలోని హుస్నాబాద్లో ముగించారు. పాదయాత్ర సందర్భంగా జాతీయ స్థాయిలో పలువురు బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చారు. పాదయాత్రలో పాల్గొన్నారు. బండి సంజయ్కు అండగా నిలిచారు.

రవికిషన్ సహా
కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, పర్షోత్తమ్ రుపాలా, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, గోరఖ్పూర్ లోక్సభ సభ్యుడు, నటుడు రవి కిషన్, బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య వంటి నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.
11 వేలకు పైగా వినతిపత్రాలు..
పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామంలోనూ సభలు, సమావేశాలను నిర్వహించారు. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు పలుమార్లు లేఖలు రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవం, దళితబంధు సహా పలు అంశాలపై లేఖాస్త్రాలను సంధించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోన్న నిధుల గురించి వివరించారు. ఇలా సుమారు 11 వేలకు పైగా వినతిపత్రాలను బండి సంజయ్ అందుకున్నారు.

కేసీఆర్ సర్కార్ పతనానికి నాంది..
ఇక తాజాగా తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియడంతో మరోసారి పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో తొలి విడత పాదయాత్ర విజయవంతమైందని, కేసీఆర్ ప్రభుత్వం పతనానికి పునాది పడిందని అన్నారు. 2023లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరనే ధీమాను బండి సంజయ్ వ్యక్తం చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక తరువాత మలి విడత పాదయాత్ర ఉండొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications