శ్రీశైలం అగ్నిప్రమాదంపై తెలంగాణ బీజేపీ చీఫ్ సరికొత్త డౌట్..డిమాండ్: రేవంత్తో గళం: రాజకీయం
హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం రాజకీయ రంగు పూసుకుంటోంది. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి కేసీఆర్ జలదోపిడీకి కుట్ర పన్నారని, ఇందులో భాగంగానే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందంటూ ఆరోపణలను గుప్పించారు. తాజాగా- భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా అదే రకమైన అనుమానాలను వ్యక్తం చేశారు.
సీఐడీపై నమ్మకం లేదంటూ..
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి గల అసలు కారణాలను వెలికి తీయడానికి సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తోన్న సీఐడీపై తమకు నమ్మకం లేదని తేల్చి చెప్పారు. సీఐడీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయనే నమ్మకం లేదని స్పష్టం చేశారు.
సీబీఐకి దర్యాప్తు..
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అప్పుడే ఈ ప్రమాదం వెనుక గల అసలు కోణం వెలుగులోకి వస్తుందని అన్నారు. ఊహించని విధంగా ఈ ఘటన చోటు చేసుకోవడం, తొమ్మిదిమంది ఉద్యోగులు మరణించడాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. సీఐడీ దర్యాప్తులో ప్రభుత్వ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లు లేదని విమర్శించారు. సీబీఐకి అప్పగించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. 2 కోట్లు
జలవిద్యుత్ కేంద్రం ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పరిహారాన్ని చెల్లించడంలో ఉద్యోగుల హోదాను పరిగణనలోకి తీసుకోకూడదని ఆయన కేసీఆర్ సర్కార్కు సూచించారు. మృతులందరి కుటుంబాలను సమానంగా చూడాలని, అదే ప్రాతిపదికన రెండు కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
ప్లాంటును కాపాడటానికి ప్రాణాలను పణంగా
జలవిద్యుత్ కేంద్రాన్ని కాపాడటానికి ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని బండి సంజయ్ అన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కాపాడే ప్రయత్నంలో తొమ్మిది మంది ఉద్యోగులు ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. మంటలు చెలరేగగానే బయటికి పరుగులు తీసి ఉంటే, వారంతా సురక్షితంగా, సజీవంగా ఉండేవారని అన్నారు. ప్రాణాలు పోతాయనే విషయం తెలిసి కూడా ఉద్యోగులు సాహసోపేతంగా మంటలు ఆర్పడానికి ప్రయత్నించారని, సోషల్ మీడియాలో విడుదలైన వీడియోల్లో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయని అన్నారు.