8న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీష్ రావు: 12 రోజులపాటు సమావేశాలు, 3 రోజులు సెలవులు
హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీతోపాటు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు.
కాగా, మార్చి 8న(ఆదివారం) రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 12 రోజులపాటు జరిగే ఈ సమావేశాలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మార్చి 9, 10, 15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు.
బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాజరయ్యారు. మార్చి 20వ తేదీన మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల పొడగింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా, శనివారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేయనున్నారు. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని సంకల్పించి సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు భద్రత కల్పించాయన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రూ. 60వేల నుంచి రూ. లక్షన్నరకు పెంచిందని గవర్నర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరేళ్లు ప్రణాళికబద్దంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.