ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ... కరోనా,లాక్డౌన్,వ్యవసాయ కొనుగోళ్లపై చర్చించనున్న మంత్రివర్గం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అంశంతో పాటు వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. రాష్ర్ట ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించేది లేనిది కేబినెట్ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్రంలో నేటి నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ న్యాయమైన హామీలను అమలుచేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ జూడాల సమ్మెపై స్పందించారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెకు ఇది సరైన సమయం కాదు.. వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇక రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరతకు కేంద్రమే కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ టీకా హబ్ అయినా గ్లోబల్ టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కోటి వ్యాక్సిన్లకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణవ్యాప్తంగా 45 ఏళ్లు పైబడినవారికి రెండో డోసు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ల కొరత కారణంగా మొదటి డోసు తీసుకున్నవారు రెండో డోసు వ్యాక్సిన్ కోసం నెల రోజులకు పైనే వేచి చూడాల్సి వస్తోంది. మంగళవారం(మే 25) నుంచి అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రెండో డోసుతో పాటు 18 ఏళ్లు నిండినవారికీ వ్యాక్సినేషన్ తిరిగి ప్రారంభించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది వైరస్ సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్న ప్రభుత్వం... వారందరికీ ఈ నెల 28 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆటో,క్యాబ్ డ్రైవర్లు,బస్ డ్రైవర్లు,హోటళ్లు,సెలూన్ సిబ్బంది,కూరగాయలు,పండ్ల వ్యాపారులు,హమాలీలు,కిరాణ,మాంసాహార దుకాణదారులు,గ్యాస్ సరఫరా సిబ్బంది తదితరులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.