తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?: ఆ రెడ్డి అవుట్..మరో రెడ్డి ఇన్?: కేసీఆర్ బరాబర్ ఈక్వేషన్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. అసెంబ్లీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారా? ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే- పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారా?, హ్యాట్రిక్ కొట్టడానికి సమాయాత్తమౌతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మొన్నటి హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూసిన తరువాత.. కేసీఆర్- పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారని చెబుతున్నారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..
2023 అక్టోబర్-నవంబర్ మధ్య జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇందులో భాగంగా- కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు పూనుకోనున్నారని సమాచారం. శాసన మండలి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత ఓ మంచిరోజు చూసుకుని కొత్త కేబినెట్కు రూపకల్పన చేస్తారని, కొత్త రక్తాన్ని ఎక్కిస్తారనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యేల కోటా శాసన మండలికి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు.
రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత..
ఎమ్మెల్యేల కోటా కింద శాసన మండలి కోసం టీఆర్ఎస్ అధినేత ఎంపిక చేసిన జాబితాలో సగం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే. గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిలకు ఈ జాబితాలో చోటు లభించింది. మిగిలిన ముగ్గురిలో మాజీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్, బండ ప్రకాష్ ఉన్నారు. కడియం శ్రీహరి ఎస్సీ, బండ ప్రకాష్ ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు.
ఆరుమంది రెడ్లు..
ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి తగిన ప్రాతినిథ్యమే ఉంది. ఆరుమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కేబినెట్లో ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జీ జగదీష్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ సమతౌల్యాన్ని కొనసాగిస్తూనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
మల్లారెడ్డికి బదులుగా..
కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని తొలగించి.. ఆయన స్థానంలో మాజీ ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డికి చోటు కల్పిస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. ఆ ఉద్దేశంతోనే ఆయనను పార్టీలోకి తీసుకున్నారని, శాసన మండలికి పంపిస్తున్నారని అంటున్నారు. మల్లారెడ్డి సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఆయనకు కీలక పదవిని అప్పగించ వచ్చని చెబుతున్నారు.
ఈటల స్థానంలో..
భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ స్థానంలో బండ ప్రకాష్కు చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఈటల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే వర్గానికి చెందిన బండ ప్రకాష్ను శాసన మండలికి ఎంపిక చేయడం వెనుక కేసీఆర్ అంతరార్థం అదేనని తెలుస్తోంది. ఈటల ఉద్వాసన వల్ల ప్రాతినిథ్యాన్ని కోల్పోయిన ముదిరాజ్ సామాజిక వర్గానికి బండా ప్రకాష్తో భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
ఎల్ రమణ పరిస్థితేంటీ?
నిజానికి- మంత్రివర్గంలో చోటు కల్పిస్తామనే హామీతోనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్లోకి వెళ్లారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ఈటల స్థానాన్ని రమణతో భర్తీ చేస్తారని భావించారు. అదే సమయంలో బండ ప్రకాష్ పేరు తెరమీదికి రావడం, ఆయనను పెద్దల సభకు పంపించడం చకచకా సాగిపోయాయి. ఎల్ రమణ పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. స్థానిక సంస్థల కోటాలను ఆయనను శాసన మండలికి ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రి పదవి ఇస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది.
కేబినెట్లోకి గుత్తా సుఖేందర్ రెడ్డి..
శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా కేబినెట్లోకి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనను మరోసారి శాసన మండలికి ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం కూడా అదేనని, బలమైన గళం ఉండాలనే కారణంతో గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో కీలకమైన శాఖను అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఈటల రాజీనామా చేయడం వల్ల ఖాళీగా ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను గుత్తా చేతిలో పెట్టే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
కడియం మరోసారి..
ప్రస్తుతం ఈ శాఖను ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు బదలాయించిన విషయం తెలిసిందే. కాగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కూడా కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అత్యంత సీనియర్ నాయకుడు కావడం, తెలంగాణ రాజకీయాలపై సమగ్రమైన పట్టు ఉండటం, కేసీఆర్తో సమకాలీకుడు కావడం వంటి అంశాలన్నీ కడియం శ్రీహరికి కలిసి వచ్చేవేనని చెబుతున్నారు.
అన్ని రకాల ఈక్వేషన్స్..
ఇలా అన్ని రకాల ఈక్వేషన్లను పరిగణనలోకి తీసుకుని.. కేసీఆర్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని చెబుతున్నారు. 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి, హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో.. కేబినెట్కు రూపకల్పన చేస్తారని అంటున్నారు. సీనియర్లు, యువతకు ప్రాతినిథ్యాన్ని కల్పించేలా కేబినెట్ కూర్పు ఉంటుందనే అభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకుని రాగల సత్తా ఉన్న వారికే టికెట్లను కూడా కేటాయిస్తారని అంటున్నారు.
ఫిబ్రవరిలో ముహూర్తం..
ఇప్పుడు భర్తీ కానున్న ఎమ్మెల్యేల కోటాతో పాటు స్థానిక సంస్థల పరిధిలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ వచ్చేనెల ముగుస్తుంది. దీనితో- కేబినెట్లోకి తీసుకోదలిచిన ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీల పేర్లు స్పష్టమౌతాయి. ఆ తరువాత మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ పూనుకుంటారని చెబుతున్నారు. జనవరిలో మంచి రోజులు లేనందున.. ఫిబ్రవరి మొదటి లేదా రెండోవారంలో విస్తరణ ఉంటుందని స్పష్టం చేస్తోన్నాయి పార్టీ వర్గాలు.