దసరా నుంచి కొత్త జిల్లాలు.. కానీ నంబర్ మాత్రం సస్సెన్స్!
హైదరాబాద్ : నాలుగు కొత్త జిల్లాల ప్రతిపాదనపై హైపవర్ కమిటీ తన నివేదికను అందజేసిన అనంతరం కేబినేట్ సమావేశం నిర్వహించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు కేబినేట్ ఆమోదం తెలిపింది. కాగా, దసరా నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు.
కొత్త జిల్లాలతో పాటు కరీంనగర్, రామగుండం, సిద్ధిపేట, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే బీసీ కమిషన్ ఏర్పాటుకు అనుకూలంగా ఉండేలా 1993 చట్టంలో సవరణలు చేసేందుకు కేబినేట్ నుంచి ఆమోదం లభించింది. ఇక అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల పరిధిలోకి మిషన్ భగీరథ కార్పోరేషన్ ను తీసుకురావాలని, ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు వాహనాల ట్యాక్స్ మినహాయింపునివ్వాలని కేబినేట్ లో నిర్ణయించారు. శేరిలింగంపల్లి పరిధిలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి నెలకొల్పనున్నారు. హోటిరో సంస్థకు చెందిన హెటిరో డ్రగ్స్ ట్రస్టుకు 15ఎకరాలు కేటాయించాలని కేబినెట్ లో నిర్ణయించారు.
ఇక కొత్త జిల్లాల పరిధిలో నియమించాల్సిన ఉన్నతాధికారుల పోస్టులకు సంబంధించి రెవెన్యూ శాఖకు మరియు పోలీస్ శాఖకు ఇన్ ప్రిన్సిపుల్ అప్రూవల్ ఇచ్చినట్టుగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.
సంఖ్యపై సస్పెన్స్ :
మొత్తం ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. 27 కన్నా పెరిగే అవకాశముందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు శ్రీహరి. దీన్నిబట్టి ఫైనల్ గా ఎన్ని జిల్లాలు ఉండబోతున్నాయనే దానిపై సస్పెన్స్ నెలకొన్నట్టయింది. తుది జాబితాలో ఉండబోయే జిల్లాలపై ఉత్కంఠ నెలకొనేలా చేశారు కడియం.