వైఎస్ మృతిపై వార్తాకథనం: జగన్ చానల్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు
హైదరాబాద్: దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక రిలయెన్స్ హస్తం ఉందంటూ వార్తా కథనాలను ప్రసారం చేసి, ఆ సంస్థ ఆస్తుల నష్టానికి కారణమైందనే ఆరోపణలపై జగన్ చానల్ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని తెలంగాణ సీఐడీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
వైయస్ మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందంటూ వైఎస్ మరణించిన కొద్ది నెలలకు జగన్ టీవీ సహా టీవీ-5, ఎన్టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో వైఎస్ అభిమానులు రిలయన్స్ సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆ మూడు టీవీ చానళ్లపై 153-ఏ(దేశద్రోహం) కింద కేసు నమోదు చేసింది.
ఈ కేసును సీఐడీ దర్యాప్తునకు చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఐడీ ఈ బాధ్యతలు చేపట్టింది. వైఎస్ అభిమానులు ధ్వంసం చేసిన రిలయన్స్ ఆస్తుల విలువ రూ.12 కోట్లుగా సీఐడీ విభాగం అంచనా వేసింది. అయితే... తెలంగాణలో కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీవీ-5, ఎన్టీవీ చానళ్లు తమను ఆ కేసు విచారణ నుంచి తప్పించాలని కోరుతూ లేఖలు రాశాయి.
జగన్ టీవీలో వచ్చిన కథనాల ఆధారంగానే తమ చానళ్లలో కథనాలు ప్రసారం చేశామని, జగన్ టీవీ కథనాలు నిజమో? కాదో? నిర్ధారించుకోకుండా వేయడం తప్పేనంటూ క్షమాపణలు చెప్పాయి. దీంతో ఆ రెండు చానళ్లను కేసు విచారణ నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇది జరిగిన తర్వాత జగన్ టీవీ కూడా సీఎం కేసీఆర్కు లేఖ రాసింది.
దేశద్రోహం కేసు నుంచి తమను తప్పించాలని కోరింది. అయితే, ఆ కేసు వ్యవహారాలు చూస్తున్న తెలంగాణ సీఐడీ విభాగం ఇందుకు అంగీకరించలేదు. దేశద్రోహం కేసు నుంచి తప్పించడం కుదరదని కేసీఆర్కు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఈ కేసులో జగన్ టీవీ సీఈవో, ఎడిటర్, ఇద్దరు జర్నలిస్టులు నిందితులుగా ఉన్నారని సీఐడీ తెలిపింది.