Bharat Biotech: క్యాంపస్ మొత్తం కేంద్రం చేతుల్లోకి: సీఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. కోవాగ్జిన్ సృష్టికర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఫార్మా కంపెనీ సెక్యూరిటీ వ్యవహారాలన్నీ ఇక కేంద్రం పరిధిలోకి వెళ్లనున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ముహూర్తం కూడా పెట్టేసింది. ఇక ఈ కంపెనీ భద్రత అంశాలన్నీ యాజమాన్యం ఆధీనంలో గానీ.. తెలంగాణ పోలీసుల చేతుల్లో గానీ ఉండదు.
Recommended Video
కోవాగ్జిన్ సృష్టికర్తగా..
భారత్ బయోటెక్ క్యాంపస్.. హైదరాబాద్ నగర శివార్లలోని షామీర్పేట్ సమీపంలో గల తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ సెక్యూరిటీ వ్యవహారాలన్నీ భారత్ బయోటెక్ యాజమాన్యమే చూసుకుంటోంది. కోవాగ్జిన్ను అభివృద్ధి చేసిన తరువాత.. ఒక్కసారిగా ఈ ఫార్మా కంపెనీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కరోనా వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన దేశీయ ఫార్మాసూటికల్స్ కంపెనీ ప్రస్తుతానికి ఇదొక్కటే.
జీనోమ్ వ్యాలీ క్యాంపస్..
జీనోమ్ వ్యాలీలోని క్యాంపస్లోనే ఈ వ్యాక్సిన్ తయారవుతోంది. త్వరలోనే బెంగళూరు, గుజరాత్లల్లో కొత్త క్యాంపస్ను నెలకొల్పడానికి భారత్ బయోటెక్ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. దీనికి అవసరమైన స్థలాన్ని కూడా సేకరించింది. ప్రస్తుతం అందరి కళ్లన్నీ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ క్యాంపస్పైనే ఉన్నాయి. దీనితో ఆ సంస్థ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ బాధ్యతను కేంద్రీయ పారిశ్రామిక బలగాల (సీఐఎస్ఎఫ్) చేతికి అప్పగించింది.
14వ తేదీ నుంచి
కేంద్రం ఆదేశాలతో సీఐఎస్ఎఫ్ ఈ దిశగా చర్యలు తీసుకుంది కూడా. ఒక ఇన్సెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణంలో మొత్తం 64 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు భారత్ బయోటెక్ క్యాంపస్కు రేయింబవళ్లు పహారా కాస్తారు. రొటేషన్ పద్ధతిన రౌండ్ ద క్లాక్ ఈ క్యాంపస్ మొత్తం వారి ఆధీనంలోనే ఉంటుంది. దీనిపై ఆ కంపెనీ ప్రైవేటు సెక్యూరిటీకి గానీ, తెలంగాణ పోలీసులకు గానీ ఎలాంటి పర్యవేక్షణాధికారాలు ఉండబోవు. ఈ నెల 14వ తేదీ నుంచి భారత్ బయోటెక్ క్యాంపస్ను తాము స్వాధీనం చేసుకుంటామని సీఐఎస్ఎఫ్ ప్రకటించింది.
భద్రతా విభాగంలో టాప్..
పరిశ్రమలకు భద్రతను కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం.. సీఐఎస్ఎఫ్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తుంది. 1969లో ఇది ఏర్పాటైంది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు.. ఢిల్లీ మెట్రో భద్రతా వ్యవస్థలు కూడా ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలోనే ఉన్నాయి. ఇదివరకు విమానాశ్రయాలు సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో కొనసాగాయి. అల్ఖైదా ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఆప్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించడం, అమెరికా న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై విమానాల దాడి వంటి ఘటనల తరువాత.. వాటి భద్రతను కేంద్ర ప్రభుత్వం సీఐఎస్ఎఫ్కు అప్పగించింది. అలాంటి ప్రతిష్ఠాత్మక భద్రతా విభాగం సీఐఎస్ఎఫ్ చేతికి భారత్ బయోటెక్ సెక్యూరిటీ వ్యవహారాలన్నీ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.