మమత బెనర్జీ టు అఖిలేష్.. కేసీఆర్కు షాక్!: ఆ అడుగులు ఎటువైపు?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడుగులు బీజేపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు సీపీఐ, కాంగ్రెస్ పార్టీ తదితర నేతలు. ఆయన భేటీ అవుతున్న ప్రాంతీయ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారు అంటున్నారు. ఇందులో తిరకాసు ఉందని చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్, జేడీఎస్ నేతలు కుమారస్వామి హెచ్డీ దేవేగౌడ, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ తదితరులను కేసీఆర్ కలిశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని, కాబట్టి అందులో చేరే అవకాశం లేదని సీపీఐ ఇప్పటికే తేల్చింది.
175 స్థానాల్లో పోటీ: పవన్, జనసేన వ్యూహకర్తగా దేవ్ నియామకం, 'అధికారంలోకి వస్తాం'
కేసీఆర్ వాదనకు వ్యతిరేకంగా
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని కేసీఆర్ దేశవ్యాప్తంగా పలువురు నేతలను కలుస్తున్నారు. అయితే, ఆయన కలుస్తున్న వారిలో చాలామంది ఆయన ప్రతిపాదనకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో నో చెబుతున్నారని అంటున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం తప్పితే, కాంగ్రెస్-బీజేపీ వ్యతిరేక కూటమి సరికాదని అంటున్నారు.
కూటమిలో కాంగ్రెస్
మమతా బెనర్జీ నుంచి మొదలు అఖిలేష్ వరకు చూసుకుంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కు వారు పూర్తిగా సమ్మతిగా లేనట్లుగా అర్థమవుతోందని అంటున్నారు. 2019లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కూటమిలో ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. మొదట కేసీఆర్ కోల్కతా వెళ్లి మమతను కలిశారు. వారి మధ్య థర్డ్ ఫ్రంట్ చర్చలు జరిగాయి. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్ ఉండాలనేది మమత ఉద్దేశ్యంగా చెబుతున్నారు.
కరుణానిధి, స్టాలిన్, అఖిలేష్ యాదవ్
కరుణానిధి, స్టాలిన్లను కేసీఆర్ కలిశారు. కానీ బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఉండాలనేది డీఎంకే అభిప్రాయంగా చెబుతున్నారు. బుధవారం కేసీఆర్తో భేటీ అనంతరం అఖిలేష్ వ్యాఖ్యలు కూడా అలాగే కనిపించాయి. కేసీఆర్ బీజేపీ-కాంగ్రెస్ వ్యతిరేక కూటమి అంటే, అఖిలేష్ మాట్లాడేటప్పుడు బీజేపీనే టార్గెట్ చేశారు. కాబట్టి ఆయన నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ కూడా కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటోంది. కేసీఆర్ ఇప్పటి వరకు కలిసిన వారిలో ఎక్కువ మంది అంటే మమత, అఖిలేష్, కరుణానిధి తదితర నేతలు కాంగ్రెస్ను కోరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ చెప్పే కాంగ్రెస్ - బీజేపీయేతర ఫ్రంట్ ఏ మేరకు సాధ్యమనేది ప్రశ్నే అంటున్నారు.
ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్
ఇదిలా ఉండగా, పదిహేను, ఇరవై ఏళ్లు మినహాయించి దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్. కాబట్టి ఈ దేశ అభివృద్ధిలో ప్రధాన వైఫల్యం కాంగ్రెస్ పార్టీది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మోడీ ప్రభుత్వం నిన్న కాక మొన్న వచ్చిందని, కాబట్టి దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి సమయం తీసుకుంటుందని, కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలో అర్థం లేదని అంటున్నారు.
అప్పుడే విమర్శలా, సమయం ఇవ్వాలి
ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పైనే టీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు తెలంగాణను ఆంధ్రా పాలకులు నష్టపరిచారని, దీనిని ఒక్క రోజులో లేదా మూడేళ్లలో మార్చలేమన్నారు. అలాంటిది ఇంత పెద్ద దేశాన్ని మోడీ మార్చడానికి మరింత సమయం పడుతుందని కొందరి అభిప్రాయం. మోడీ ప్రజలను మచ్చిక చేసుకునేలా తాయిలాలు కాకుండా, ఓట్లు అనే అంశాన్ని పక్కన పెట్టి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.