నీతి అయోగ్లో కేసీఆర్ సూచనలు, ఢిల్లీలో ఉండి కేజ్రీవాల్కు మద్దతు తెలపకపోవడంపై ప్రశ్నలు
పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయితే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతోందన్నారు. కీలక ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు.
రూ.1,050 కోట్ల వ్యయంతో గత మూడేళ్లలో 18.30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 356 గోడౌన్లను నిర్మించినట్లు చెప్పారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇవ్వలేని పరిస్థితుల్లో పన్ను రాయితీలనైనా కల్పించాలని కోరారు. రాష్ట్రాల అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి ఉందన్నారు.
వ్యవసాయానికి అనుంబంధ రంగాలైన పౌల్ట్రీ, మేకలు, గొర్రెలు, చేపల పెంపకం, డెయిరీ రంగాలపై దృష్టి సారించాలన్నారు. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును ఇవ్వాలని కోరారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాన్నారు.
వైద్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నగరీకరణ అంశాల్లో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛను ఇవ్వాలని కోరారు. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, రక్షణ, అంతర్జాతీయ అంశాలపై కేంద్రం మరింత దృష్టిని సారించాలన్నారు.
కేజ్రీవాల్కు మద్దతు పలకని కేసీఆర్
ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు గత కొన్నాళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు అయిన మమతా బెనర్జీ, దేవేగౌడ, కుమారస్వామి తదితరులను గతంలో కలిశారు. అయితే ఇప్పుడు ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతు తెలపకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్కు మద్దతు తెలపకపోవడంపై సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి.