వచ్చే వారం తిరుమలకు కేసీఆర్: శ్రీవారికి భారీ కానుకలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమ సమయం నాటి మొక్కును తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో తిరుమల, తిరుపతి పర్యటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమ సమయం నాటి మొక్కును తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో తిరుమల, తిరుపతి పర్యటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ ఏర్పడితే స్వామివారికి, అమ్మవార్లకు ఆభరణాలు సమర్పిస్తానని సీఎం మొక్కుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆయన కోరిక తీరడంతో, ప్రభుత్వం తరఫున తయారు చేయించిన రూ. 5.5 కోట్ల విలువైన ఆభరణాలను తీసుకుని ఆయన వెంకటేశ్వరుని దర్శనానికి రానున్నారు. 21 మంగళవారం సాయంత్రం తిరుపతికి చేరుకోనున్నారు కేసీఆర్. ఆ రాత్రికి తిరుమలలో బస చేసి, ఆపై ఫిబవ్రవరి 22న ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకుని ఆభరణాలను బహూకరించనున్నారు.

ఆపై తిరుపతికి వచ్చి అలివేలు మంగాపురంలో అమ్మవారికి మొక్కులు చెల్లించి, అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం తిరుమల పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది.
కాగా, వెంకన్నకు రూ. 5 కోట్ల విలువైన ఆభరణాలను కేసీఆర్ ఆదేశాల మేరకు కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ జ్యూయెలరీస్ తయారు చేసిందన్న సంగతి తెలిసిందే. వీటిల్లో రూ. 3.7 కోట్ల విలువైన 14.2 కిలోల సాలగ్రామ హారం, రూ. 1.21 కోట్ల విలువైన 4.65 కిలోల కంఠాభరణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేయించింది. అలివేలు మంగమ్మకు బంగారు ముక్కుపుడకను కేసీఆర్ సమర్పించనున్నారు. కొందరు మంత్రులు, బంధు మిత్రులతో కలసి ప్రత్యేక విమానంలో కేసీఆర్ రేణిగుంటకు చేరుకుంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications