నెంబర్ వన్: కేసీఆర్ ఆనందం, రేవంత్కు 'చంద్రబాబు' షాక్
హైదరాబాద్: దేశంలో మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంపికైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏడోస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిలిచారు.
మరోవైపు, వీడీపీ అసోసియేట్స్ సంస్థ జరిపిన సర్వేలో ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 51 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. రాష్ట్రంలో ఉన్న 17 లోకసభ స్థానాలూ టీఆర్ఎస్ వశం కానున్నట్టు కూడా ఫలితాలు వెల్లడించాయి.
సర్వే: కెసిఆర్ నెంబర్ వన్, బాబు దిగదుడుపే...
ఈ నేపథ్యంలో పార్టీలోని ముఖ్యనేతల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారని తెలుస్తోంది. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజల మనోభావాలమేరకు, వారికేం కావాలో తెలుసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అందుకే ప్రజలు మనపై మరింత నమ్మకంతో ఉన్నారన్నారు.
ప్రజలు వ్యక్తపరిచిన విశ్వాసం మనపై మరింత బాధ్యత మోపిందన్నారు. రాబోయే రెండున్నర సంవత్సరాల కాలం మరింత కీలకం కాబట్టి మరింత అప్రమత్తంగా పని చేయాలన్నారు.
జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న రెండు సంస్థలు తాజాగా నిర్వహించిన సర్వేల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఎదురులేని విధంగా ప్రజలు మద్దతు తెలిపినట్లు తేలింది. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సంస్థ చేసిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్కు 67.88 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అలాగే 119 స్థానాలకుగాను 109 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందుతుందని వెల్లడైంది.
ఇదే సర్వే దేశంలోని ముఖ్యమంత్రులందరిలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 51 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 17 లోకసభ స్థానాలూ టీఆర్ఎస్ వశం కానున్నట్టు కూడా ఫలితాలు వెల్లడించాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టి సుమారు రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఇదే సమయంలో ప్రజల నాడిని బహిరంగపరుస్తూ రెండు సర్వేల్లోనూ వచ్చిన ఫలితాలపై రెండు రోజుల క్రితం పార్టీకి చెందిన పలువురితో ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటించారని తెలుస్తోంది.
ప్రజల్లో ప్రభుత్వంపై, పరిపాలనపై విశ్వాసం, నమ్మకం కనబడుతోందని, ప్రజలు మనపై ఉంచిన విశ్వాసం మనపై మరింత బాధ్యత పెంచిందని, రాబోయే రెండున్నరేళ్ల కాలం మనకు మరింత కీలకమని, మన పరిపాలనలో ప్రజలకు ఇంకేం కావాలో చర్చించుకునేందుకు, సమీక్షించుకునేందుకు అంతర్గతంగా ఒక సమావేశం నిర్వహించుకుంటే మంచిదని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నారని తెలుస్తోంది.
దీనికి స్పందించిన పార్టీ నేతలు అధికారంలోకి వచ్చి డిసెంబరు 2 నాటికి సరిగ్గా రెండున్నరేళ్లు పూర్తవుతుందని, ఆ రోజు పార్టీ పరంగా భారీ సభ ఏర్పాటుచేసుకుంటే బాగుంటుందని సూచించారని, దానికి కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, దేశంలో సీఎంలలో తొలి స్థానంలో కేసీఆర్ ఉన్నారు. ఏడో స్థానంలో చంద్రబాబు ఉన్నారు. ఇది తెలంగాణ టిడిపి నేతలు మాట్లాడలేని పరిస్థితి కల్పించిందని అంటున్నారు. చంద్రబాబు హైటెక్ సీఎంగా పేరు గాంచారు. సర్వే కారణంగా తెరాస నేతలు మాత్రం ఉత్సాహంగా ఉన్నారని చెప్పవచ్చు.