సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు డయానా అవార్డు: తండ్రిగా గర్వంగా ఉందంటూ కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న వారికి అందించే ప్రతిష్టాత్మక డయానా అవార్డు-2021 హిమాన్షును వరించింది. కాగా, గ్రామాల స్వయం సమృద్ధి కోసం ఇటీవల 'షోమా' పేరుతో హిమాన్షు ఓ వీడియో రూపొందించారు.
సమాజ సేవకు గాను హిమాన్షుకు డయానా అవార్డ్..
కల్తీ ఆహారం పట్ల అవగాహన కల్పిస్తూ.. కల్తీ లేని ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా గ్రామీణ ప్రజలన చైతన్యవంతుల్ని చేయడంపై, గ్రామాలు స్వయం సమృద్ధి పొందడమెలా అనే విషయాలను వీడియోలో హిమాన్షు వివరించారు. ఈ నేపథ్యంలో హిమాన్షు చేసిన ప్రయత్నానికి మెచ్చిన డయానా అవార్డు ఆర్గనైజేషన్ అతడికి అవార్డు ప్రకటించింది.కాగా, ఈ విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తనకు అవార్డు రావడం ఎంతో సంతషంగా ఉందన్నారు.
తాత కేసీఆర్కు హిమాన్షు కృతజ్ఞతలు..
తాను చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడంలో తనకు మార్గదర్శకుడిగా నిలిచిన తన తాత, సీఎం కేసీఆర్కు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ కార్యక్రమం చేపట్టిన గంగాపూర్-యూసుఫ్ఖాన్పల్లి వాసులకు, తన గురువులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు హిమాన్షు. డయానా అవార్డు గురించి కూడా హిమాన్షు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దివంగత బ్రిటన్ యువరాణి డయానా జ్ఞాపకార్థం డయానా అవార్డ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. సమాజానికి సేవ చేస్తున్న 9 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందజేస్తున్నారు.
తండ్రిగా గర్వంగా ఉందంటూ కేటీఆర్.. థాంక్యూ దాదా అంటూ హిమాన్షు
కాగా, తన కుమారుడు హిమాన్షు డయానా అవార్డు అందుకోవడం పట్ల కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తండ్రిగా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. థాంక్యూ దాదా అంటూ హిమాన్సు ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు. ట్విట్టర్లో తన తండ్రిలాగే ఎప్పుడూ యాక్టివ్గ్గా హిమాన్షు.. తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హిమాన్షును సోషల్ మీడియా వేదికలో ఫాటో అవుతూ తమ సమస్యలను అతని దృష్టికి తీసుకెళుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications