ఢిల్లీ బయల్దేరి వెళ్లిన సీఎం కేసీఆర్: రాష్ట్రపతితో భేటీకి ఛాన్స్, కీలక సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రెండు మూడు రోజులపాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ వ్యూహాంపై మరోసారి ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీలో చర్చించే అవకాశం ఉంది. పలువురు విపక్ష నేతలు, రైతు నేతలతో... సీఎం కేసీఆర్ భేటీకానున్నట్లు సమాచారం. కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, తదితరులు ఢిల్లీకి వెళ్లారు.
అంతేగాక, మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.
మరోవైపు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపైనా ఇతర పార్టీల నేతలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక, పోడు భూముల చట్ట సవరణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.