ఇవి కావాలి: ప్రధానితో సీఎం గంటపాటు భేటీ, కెసిఆర్ను మెచ్చుకున్న మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి కరవు నిధులు, అధికారుల విభజన తదితర అంశాలపై ఆయన సుమారు గంటపాటు ప్రధానితో చర్చించారు.
విభజన చట్టంలోని హామీలను అన్నింటిని నెరవేర్చాలని ప్రధానిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందున రాష్ట్రానికి సివిల్ సర్వీస్ అధికారులను పెంచాలని కోరుతూ ఓ నివేదికను అందచేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశంలో ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్తో పాటు కేంద్ర ఆర్థిక హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు, పెండింగ్ నిధులు, పనులు తదితరాల పైన కూడా చర్చించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించారని తెలుస్తోంది.
అంతకుముందు, కెసిఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు డాక్టర్ కే కేశవ రావు, జితేందర్ రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పసునూరి దయాకర్, బీబీ పాటిల్, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు.
తెలంగాణకు కరువు నిధులివ్వండి
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తీవ్ర కరువుతో అల్లాడుతోందని, కేంద్రం కరువు నిధులు ఇచ్చి ఆదుకోవాలని ఎంపీ దేవేందర్ గౌడ్ రాజ్యసభలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 225 మండలాలలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణా నుంచి 14 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారన్నారు. తెలంగాణకు నిధులు ఇచ్చి ఆదుకోవాలన్నారు.
వర్షాలు తక్కువ పడ్డాయని మోడీకి చెప్పా: కెసిఆర్
ప్రధానితో భేటీ అనంతరం కెసిఆర్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రధానికి వివరించినట్లు చెప్పారు. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొవడానికి, కరువు నివారణ కోసం చేపట్టే పనులకు అవసరమైన నిధులను సమకూర్చాలని ప్రధానిని కోరానని తెలిపారు.
ఏడు జిల్లాల్లో 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని సీఎం తెలిపారు. తెలంగాణ సాధారణ వర్షపాతం కన్నా ఈసారి 14 శాతం తక్కువ కురిశాయని ప్రధానికి వివరించానన్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
ఇన్పుట్ సబ్సిడీ, మంచినీటి సరఫరా, పశుగ్రాసం అందజేయడానికి ప్రజలకు ఉపాధి కల్పించడానికి రూ.3064 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరామని, కానీ కేంద్రం కేవలం రూ.712 కోట్లు మాత్రమే ఇచ్చిందని వివరించారు. మిగతా నిధులను విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కరువును ఎదుర్కొవడానికి తాత్కాలికంగా చేపట్టిన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి వివరించారు. కరువును ఎదుర్కొవడానికి మంచినీటి సరఫరా, ఇన్పుట్ సబ్సిడీ, పశుగ్రాసం పంపిణీ, పిల్లలకు మధ్యాహ్న భోజనంలాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు మంచినీరు, పొలాలకు సాగునీరు అందించే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలను ప్రధాని మోడీ అభినందించారు.