ఫెడరల్ ఫ్రంట్ ఆదరబాదరాగా చేయాల్సింది కాదు: మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ
కోల్కతా: కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరుసగా నేతలను కలుస్తున్నారు. ఆదివారం ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిశారు. సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
మమతా బెనర్జీతో జాతీయ రాజకీయాలపై చర్చించామని కేసీఆర్ చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయని అన్నారు. ఇప్పటికే తాను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించానని, త్వరలోనే పటిష్ట ప్రణాళికతో ముందుకొస్తామని, ముందు ముందు చర్చలు కొనసాగుతాయని తెలిపారు.
ఫ్రంట్ ఆదరబాదరాగా చేయాల్సింది కాదు
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బలోపేతానికి కృషి చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంటే ఆదర బాదరాగా చేయాల్సింది కాదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, కేసీఆర్ ఒడిశా నుంచి నేరుగా కోల్కతాకు వెళ్లారు. మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కాళీమాతను దర్శించుకున్న అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్తారు. రెండు మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో భేటీ అవుతారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ ఆయన భేటీ అవుతారు.

ఎవరికీ బీ టీమ్ కాదు
ఆదివారం నవీన్ పట్నాయక్తో భేటీ అనంతరం ఆయనతో కలిసి కేసీఆర్ మాట్లాడారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమయిందన్నారు. వాటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీకి గానీ, కాంగ్రెస్కు గానీ బి టీమ్గా ఉండదని, తమదే సొంత టీమ్ అని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని, వాటికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు జాతీయ స్థాయిలో చర్చలు ప్రారంభమయ్యాయన్నారు.

దేశంలో గుణాత్మక మార్పు అవసరం
దేశంలో గుణాత్మక మార్పు అవసరమని వారు చెప్పారు. ఈ దిశగా ఇప్పుడు చర్చలు ప్రారంభమయ్యాయని, మేం నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తున్నామని, త్వరలోనే మరోసారి నవీన్ పట్నాయక్ను కలుస్తానని చెప్పారు. దేశంలో మరికొందరు రాజకీయ నాయకులతోనూ చర్చించాల్సి ఉందని, భవిష్యత్తులో మార్పు చూస్తారని చెప్పారు.

నవీన్ పైన ప్రశంసలు
ఈ సందర్భంగా కేసీఆర్... నవీన్ పైన ప్రశంసలు కురిపించారు. నవీన్ పట్నాయక్ దేశంలో సీనియర్ నాయకుడని, ముఖ్యమంత్రి అన్నారు. అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. దేశానికి ఏదో చేయాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. ఒడిశాలో రైతుబంధు తరహా పథకాన్ని అమలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు మద్దతు తెలపాలని హైదరాబాద్కు లేఖ పంపించారని, ఈ డిమాండ్కు తెరాస మద్దతిస్తుందన్నారు. తమ చర్చలు సానుకూలంగా జరిగాయని, త్వరలోనే పూర్తి వివరాలతో ముందుకు వస్తామన్నారు.












Click it and Unblock the Notifications