అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం KCR
అజ్మీర్ దర్గా ఉరుసుకు ప్రతి సంవత్సరం సమర్పించినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంవత్సరం కూడా చాదర్ సమర్పించారు.
అజ్మీర్ దర్గా ఉరుసు సందర్భంగా, ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే 'చాదర్'ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ఏడాది కూడా సమర్పించారు. ప్రగతి భవన్ లో ముస్లిం మతపెద్దల సమక్షంలో ముందుగా దైవ ప్రార్థనలు జరిపారు. అనంతరం చాదర్ ను ఆజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు కేసీఆర్ వక్ఫ్ బోర్డు అధికారులకు అందచేశారు. మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ భారత రాష్ట్ర సమితి ఒక్కటేనని, రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మైనారిటీలకు బీఆర్ఎస్ వరాలజల్లు కురిపించబోతుందన్నారు.
ఖాదీ బోర్డ్ చైర్మన్, మౌలానా.. యూసిఫ్ జాహిద్, ముఫ్తీ- మస్తాన్ వలి, హాఫెజ్ సాబెర్ పాషా ఈ సందర్భంగా ప్రార్థనలు జరిపారు. తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్నీ ముఖ్యమంత్రిని చల్లగా చూడాలని, రాష్ట్రం మరింత ప్రగతి పథంలో సాగాలని, దేశ ప్రజలంతా ఐకమత్యంతో జీవించేలా దీవించాలని అల్లాను ప్రార్థించారు.
చాదర్ సమర్పించే కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, సాంఘీక, మైనారిటీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్థిక వైద్యశాఖల మంత్రి హరీష్ రావు, సాంస్కృతిక పర్యాటక క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి.. మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్., ఎమ్మెల్యేలు మహమ్మద్ షకీల్, గ్యాదరి కిశోర్ కుమార్, సుధీర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులతో పాటు, వక్ప్ బోర్డు చైర్మన్ మసీఉల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ఉర్దూ అకాడెమీ చైర్మన్ ఖాజా మొజీబుద్దీన్, ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఆర్టీఐ కమిషనర్ మహమ్మద్ అమీర్, టీ న్యూస్ ఉర్దూ ఎడిటర్ ఖాజా ఖయ్యూం అన్వర్ తదితరులు పాల్గొన్నారు.