తమిళనాడుకు కేసీఆర్: ఆ ఆలయ దర్శనం: స్టాలిన్తో: జాతీయస్థాయిలో రాజకీయ శూన్యత: భర్తీ చేసేలా
చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరోసారి థర్డ్ఫ్రంట్ ప్రయత్నాలకు తెర తీసినట్టు కనిపిస్తోంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ.. ఆ మరుసటి ఏడాదే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మూడో కూటమిని దేశ రాజకీయాల ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నాలు ఆరంభించినట్టే. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఆశించిన స్థాయిలో సీట్లు దక్కకపోవడంతో థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలకు కొంత బ్రేక్ పడింది. ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకూడదని కేసీఆర్ ఆశిస్తున్నారనే అంచనాలు ఉన్నాయి.

శ్రీరంగం ఆలయంతో షురూ
ఇందులో భాగంగా కేసీఆర్ ఆ మధ్యాహ్నం తమిళనాడుకు బయలుదేరి వెళ్లనున్నారు. కుటుంబంతో సహా వెళ్తారని తెలుస్తోంది. కావేరి నదీ తీరాన వెలిసిన ప్రఖ్యాత శ్రీరంగం ఆలయాన్ని దర్శించనున్నారు. అక్కడ కొలువైన శ్రీరంగనాథ స్వామివారిని సేవించుకోనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం- చెన్నైకి బయలుదేరి వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో సమావేశమౌతారు. ఆయన నివాసంలో ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

స్టాలిన్తో భేటీ..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్టాలిన్ తండ్రి కరుణానిధికి నివాళి అర్పిస్తారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్టాలిన్ నివాసంలో భోజనం చేస్తారని అంటున్నారు. స్టాలిన్ కుమారుడు, డీఎంకే శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఇందులో పాల్గొంటారని సమాచారం.
చెన్నైలో స్టాలిన్ను కలుసుకోవడం ఇది రెండోసారి అవుతుంది. ఇదివరకు స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ ఆయనను కలుసుకున్నారు. ఆయన ఇంట్లోనే భోజనం చేశారు. అప్పట్లోనూ థర్డ్ఫ్రంట్కు సంబంధించిన అంశాలే వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చాయనే విషయం తెలిసిందే.

రాజకీయ శూన్యత..
అవేవీ కార్యరూపాన్ని దాల్చలేదు. ఈ సారి మరింత పక్కా వ్యూహంతో, పకడ్బందీ ప్రణాళికలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సహా అనేక అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తోన్నాయని కేసీఆర్ అంచనా వేస్తోన్నారు. ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి తన సత్తాను చాటుకోలేకపోతోందనేది కేసీఆర్ అభిప్రాయమని, జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత ఏర్పడిందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.
Recommended Video

మమత ప్రయత్నాలు..
దీన్ని భర్తీ చేసేలా.. ఎన్డీఏ, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ను తీర్చిదిద్దడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండబోదని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ దిశగా తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టేనని, దీన్ని మరింత ముమ్మరం చేసేలా కేసీఆర్ పావులు కదుపుతారని చెబుతున్నారు. తటస్థంగా ఉంటూ వస్తోన్న బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి నేతలను కూడగట్టుకోవాలని, అప్పుడే థర్డ్ఫ్రంట్ సాకారమౌతుందని అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications