తొలిసారి గాంధీ ఆస్పత్రికి కేసీఆర్: కరోనా రోగులకు ధైర్యం చెప్పిన సీఎం, వైద్యులకు అభినందనలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆయనతోపాటు మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్.. వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ఆస్పత్రిలో పరిస్థితిని, రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
వైద్యులకు అభినందన.. కరోనా రోగులకు పరామర్శ
ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు. అంతేగాక, ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను స్వయంగా వెళ్లి పరామర్శించారు. అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు.కరోనా ఎమర్జెన్సీ వార్డు, ఓపీ వార్డులను కేసీఆర్ సందర్శించారు.
కరోనా బాధితులకు ధైర్యం చెప్పి కేసీఆర్..
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 1500 మంది కరోనా రోగులు చికత్స పొందుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేసీఆర్.. రోగులకు ధైర్యం చెప్పారు. కరోనా నుంచి అందరూ కోలుకుంటారని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. కాగా,గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ వసతి, ఔషధాల సరఫరా తదితర అంశఆలపై అక్కడి వైద్యులతో కేసీఆర్ మాట్లాడారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుమారు 40 నిమిషాలపాటు సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రి పర్యటన కొనసాగింది.
సీఎం అయిన తర్వాత తొలిసారి గాంధీ ఆస్పత్రికి కేసీఆర్..
కాగా, కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా హైదరాబాద్లోకి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గత ఏడాదిలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అప్పటి మంత్రి ఈటెల రాజేందర్ ఆస్పత్రిని సందర్శించిన విషయం తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ మొదటిసారిగా గాంధీ ఆసుపత్రిని సందర్శించడం ఆసక్తికరంగా మారింది.
ఈటల రాజేందర్ తొలగింపు తర్వాత ఇక అంతా కేసీఆరే..
కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను తప్పించిన తర్వాత ఆ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దే ఉంచుకున్ని విషయం తెలిసిందే. వైద్య, ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటంతో కేసీఆర్ స్వయంగా కరోనా పరిస్థితులపై పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేసీఆర్.. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, గత 24 గంటల వ్యవధిలో 71,616 నమూనాలను పరీక్షించగా 3982 మందికి కరోపా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. తాజాగా, మరో 27 మంది మహమ్మారి బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 3012కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 5186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 607 మందికి కరోనా సోకింది. తెలంగాణలో ప్రస్తుతం 48,110 యాక్టివ్ కేసులున్నాయి.