కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో కుటుంబసమేతంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు: ఏమన్నారంటే?
ముంబై/హైదరాబాద్: మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. కుటుంబ సమేతంగా కొల్హాపూర్ వెళ్లిన కేసీఆర్.. అక్కడ దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సీఎం కుటుంబానికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
మహాలక్ష్మి అమ్మవారికి కేసీఆర్.. తన కుటుంబ సభ్యులతో సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత కేసీఆర్ కుటుంబసభ్యులు తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారన్నారు.
చాలా రోజుల నుంచి నేను ఈ ఆలయానికి వద్దామని.. అమ్మ ఆశీస్సులు తీసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. దేశం అభివృద్ధి పథంలో సాగాలని.. రైతులు ఆనందంగా ఉండాలని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కాగా, ఇటీవల సీఎం కేసీఆర్, కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక విమానంలో తిరుచ్చికి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీరంగానికి వెళ్లి రంగనాథస్వామి ఆలయాన్ని చేరుకున్నారు.
వేద మంత్రాలతో రంగనాథ స్వామి ఆలయ పండితులు సీఎం కేసీఆర్కు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. ఆలయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తిరుచ్చి కలెక్టర్ శివరాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్కు స్వాగతం పలికి ఆయనతో మాట్లాడారు. సీఎం పర్యటన నేపథ్యంలో తమిళనాడు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ పర్యటనలో తమిళనాడు సీఎం స్టాలిన్తో సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించారు.