23న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గురువారం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గురువారం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. పర్యటనలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతోపాటు రైతులను పరామర్శించనున్నారు.
గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఖమ్మం జిల్లా బోనకల్లులో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. అనంతరం వరంగల్ జిల్లాలో పంటలను పరిశీలించి, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా చేరుకుంటారు. రామడుగు మండలంలో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు.

ఆయా ప్రాంతాల్లో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుంటారు. సీఎం పర్యటన దృష్ట్యా ప్రత్యేక హెలిప్యాడ్ తోపాటు రైతు వేదికలో సమావేశం నిర్వహించే ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం నుంచి హెలీకాప్టర్ ద్వారా మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకొని చేరుకొని అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అక్కడే బాధితులతో మాట్లాడతారని చెప్పారు. రెడ్డికుంట తండా నుంచి హెలీకాప్టర్ ద్వారా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, అడవి రంగాపురానికి చేరుకుని అకాలవర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధితులను ఓదారుస్తారని మంత్రి తెలిపారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్, వ్యవసాయ అధికారులు, సంబంధిత ఇతరశాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారని మంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications