తెలంగాణలోనూ ఆ రెండు రాష్ట్రాల తరహాలో సేకరణ జరగాలి: ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
హైదరాబాద్: ధాన్యం సేకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. తెలంగాణలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు పంటల సేకరణ పాలసీ లేదని చెప్పారు. పంజాబ్, హర్యానాలో వందశాతం ధాన్యాన్ని సేకరిస్తున్నారని తెలిపారు.
పంజాబ్, హర్యానా తరహాలో తెలంగాణలో ధాన్యం సేకరణ జరగడం లేదన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ రంగ నిపుణులతో జాతీయ స్థాయి పంటల సేకరణ విధానంపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పంటల దిగుబడి పెరిగిందన్నారు. సాగు విస్తీర్ణం పెరగడంతో రైతులు ఆత్మహత్యలు, వలసలు తగ్గాయని కేసీఆర్ వివరించారు.
మరోవైపు, తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధాన్యం ఉత్పత్తి పెరగడంతో ఎగుమతికి అవకాశం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎగుమతిదారులు గతేడాది కూడా భారీగా ఎగుమతులు చేశారని గుర్తు చేశారు.
తెలంగాణలో పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తునన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవడానికి తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ కోరారు.
రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. కాగా, రాష్ట్ర మంత్రులకు పీయూష్ గోయల్ సమయం ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఛాంబర్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు గోయల్తో సమావేశం కానున్నారు.