Telangana: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Telangana: రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం ఆయా నియోజకవర్గాల్లో అనువైన స్థలాలను పరిశీలించాలని విద్యా శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. స్థలాల సేకరణతో పాటు ఇతర వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
వంద నియోజకవర్గాల్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసే లా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపు పూర్తయితే.. ఇతర అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచనలు చేశారు. స్కూళ్లకు కేటాయించిన స్థలాలు అనువైనవా లేదా అని సర్వే చేయించాలని సూచించారు. ఒకవేళ కేటాయించిన స్థలాలు అనువుగా లేకపోతే మరో చోట కేటాయించాలని అన్నారు. ఆయా జిల్లాలలకో చెందిన కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి యుద్ధ ప్రాతిపదికన స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన పూర్తి నివేదికను వారం రోజుల్లోగా విద్యాశాఖ అధికారులకు అందజేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.













Click it and Unblock the Notifications