CM Revanth Reddy: నవంబర్ 8న పాదయాత్ర చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 8న పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మూసీ పరిస్థితిని వివరించేందుకు రేవంత్ నడుం బిగించనున్నారు. వలిగొండ నుంచి బీబీనగర్ వరకు అంటే ఆరు కిలోమీటర్ల మేర మూసీ వెంట నడవనున్నారు. నదిలోని కాలుష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. మూసీని ప్రక్షాళన చేయాలని సీఎం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు.
వారికి డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పలువురు మంత్రులను సియోల్ పర్యటనకు పంపారు. అక్కడ నగరంలో మధ్యలోంచి వెళ్తోన్న నది ఎలా ప్రక్షాళన చేశారో చూసి రావాలని వారిని పంపారు. సియోల్ వెళ్లిన బృందంలో మంత్రులు పొంగులేటి, పొన్నం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ నగర్ మేయర్ విజయలక్ష్మి ఉన్నారు. వీరంతా అక్కడ నదిని పరిశీలించి వచ్చారు. ప్రభుత్వం మొదటి దశలో భాగంగా మూసీని 21 కిలోమీటర్ల మేర ప్రక్షాళన చేయాలని భావిస్తుంది.

మూసీ ప్రక్షాళన పట్ల పలువురు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ హైదరాబాద్ భవిష్యత్ కోసం ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒకప్పుడు మూసీ నది చాలా బాగుండేదని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వికారాబాద్ లోని అనంతగిరి గుట్టల్లో పుట్టిన మూసీ.. వడి వడిగా అడుగులు వేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కృష్ణానదిలో కలుస్తోంది. అయితే హైదరాబాద్ లో మూసీ నదిలో మురికి నీరు, పరిశ్రమల వ్యర్థాలు కలిపోయాయి. స్వచ్ఛమైన నీటితో ప్రవహించే నది ఇప్పుడు కాలకూట విషంతో ప్రవహిస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసీ నదితో పండుతున్న పంటల్లో విషం ఉంటుంది. అందుకే నదిని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాలు గవర్నమెంట్ ను టార్గెట్ చేస్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 8న రేవంత్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని పాదయాత్ర చేయనున్నారు. ఆ రోజు కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications